TS ePASS : విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
TS Post-Matric Scholarships 2023: విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. 2022-23 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
TS Post-Matric Scholarships 2023 Updates: 2022-23 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. దరఖాస్తు చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యూవల్ చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. మరో 15 రోజుల పాటు గడువును పొడిగించింది. జూన్ 1 నుంచి 15 వరకు e-పాస్ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రెన్యూవల్ చేసుకునే వారు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తుకు సంబంధించిన హాడ్ కాపీ సంబంధిత జిల్లా సంక్షేమ అధికారితో పాటు కాలేజీలకు అందజేయాల్సి ఉంటుంది.
UG, పీజీ, డిప్లోమా ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశ నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఓయూ నిర్వహిస్తున్న పీజీసెట్ నోటిఫికేషన్ రాగా... తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ నుంచి కూడా ప్రకటన విడుదలైంది. పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు ప్రవేశాల నిబంధనలను పేర్కొంది.
ఈ ప్రకటనలో భాగంగా... శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా... జూన్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆలస్య రుసుముతో జూన్ 30వ తేదీ లోగా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మరిన్ని వివరాల కోసం www.pstucet.org వెబ్సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.