Hyd Traffic Police: రాంగ్ రూట్ కు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1200 ఫైన్
hyderabad traffic rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఇప్పటికే కొత్త రూల్స్ని ప్రవేశపెట్టగా… తాజాగా మరో డ్రైవ్ చేపట్టనున్నారు. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు.
Hyderabad Traffic Police Special Drive: ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు.గత నెలలోనే కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకువచ్చిన పోలీసులు… తాజాగా మరో డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించేందుకు కార్యాచరణను ప్రకటించారు.
రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తేరూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
రాంగ్ రూట్ లో డ్రైవింగ్ కారణంగా 2020 ఏడాదిలో 15 మంది, 2021లో 21 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకు మరో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ట్రిపుల్ రైడింగ్ కారణంగా 2020లో 24 మంది, 2021లో 15 మంది... ఈ ఏడాదిలో ఇప్పటివరకు మరో 8 మంది చనిపోయినట్లు తెలిపారు. మోటర్ వెహికిల్ చట్టంలో సెక్షన్ 119/177, 188(wrongside driving ), సెక్షన్ 128/184, R/W 177(triple riding) ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఈ రూల్స్ ను అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇప్పటికే స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ నెలలో ప్రకటించారు. మరోవైపు లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలిపినా... భారీగా జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నడటంతో వాహనాదారులు బీ అలర్ట్ గా ఉండాల్సిందే.