Telangana Cabinet : ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు - తొలి కేబినెట్ నిర్ణయాలివే
Telangana Cabinet Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ఆరు గ్యారెంటీల హామీపై చర్చించగా… మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet Latest News: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో… పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 6 గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలు:
-సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు.
-ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచటంపై కేబినెట్ నిర్ణయం.
-ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎంపిక ఉంటుంది.
-డిసెంబర్ 8వ తేదీన పలు గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్రెడ్డి చర్చిస్తారు.
-24 గంటల కరెంటు ఇస్తాం.. ఇందుకోసం అధికారులను ఆదేశించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
-గత ప్రభుత్వంలో ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగింది.. రేపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ ఉంటుంది.
-విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
-ఆధార్ కార్డ్ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
-2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఫైనాన్స్ కి సంబంధించిన ఖర్చు,వేటి కోసం ఖర్చు చేశారనే దానిపై శ్వేతా పత్రం విడుదల చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడి.
-రాబోయే 5 సంవత్సరాలల్లో 24 గంటల విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తాం.