CM KCR Review: అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష... సీఎస్కు ఆదేశాలు
Unseasonal Rains in Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పంట నష్టాన్ని అంచనా వేసే చర్యలను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
CM KCR Review On Crop Damage: గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. ధాన్యం తడిసిపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, పంట నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతినటంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యద్రశి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.
హెచ్చరికలు జారీ
Rains to Telangana : తెలంగాణలో కూడా గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 26 తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని..ఈ జిల్లాల్లో వడగండ్లు పడుతాయని హెచ్చరించిది. ఈ జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. ఇక వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏప్రిల్ 27వ తేదీ వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది. అకాల వర్షాల దాటికి పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం, వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక సోమవరాం (రేపు) అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా చెట్ల కింద ఉండొద్దని సూచించింది.
సంబంధిత కథనం