Stock market today: కొనసాగుతున్న లాభాల ట్రెండ్.. 60 వేల మార్కు దాటిన సెన్సెక్స్
Stock market today: స్టాక్ మార్కెట్లలో మదుపరుల ఆశలు పుంజుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యంపై ఆందోళనలను తగ్గిస్తూ ద్రవ్యోల్భణ గణాంకాలు వెలువడడంతో షేర్ల ధరలు పుంజుకుంటున్నాయి.
Stock market today: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 63.93 పాయింట్లు పెరిగి 59,906 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19.90 పాయింట్లు పెరిగి 17,845 పాయింట్ల వద్ద ట్రేడైంది. ఉదయం 10.10 సమయంలో సెన్సెక్స్ 260.81 పాయింట్లు లాభపడి 60,103 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే నీఫ్టీ 78.25 పాయింట్లు లాభపడి17,901 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ (top gainers) జాబితా
టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, టాాటా మోటార్స్ తదితర స్టాక్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ 1.73 శాతం, ఐచర్ మోటార్స్ 1.11 శాతం, హీరో మోటార్స్ 1.28 శాతం, బీపీసీఎల్ 1.26 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ (top losers) జాబితా
టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, అపోలో హాస్పిట్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హిందాల్కో, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, యూపీఎల్ తదితర స్టాక్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి.
ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 95.84 పాయింట్లు పెరిగి 59,938.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42.90 పాయింట్లు పెరిగి 17,868.15 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మార్కెట్లలో పెరుగుతున్న సానుకూలత
నిన్న మంగళవారం సెన్సెక్స్ 379 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 17,800 స్థాయికి ఎగువన ముగిసింది. ద్రవ్యోల్బణం ఆందోళనలు తగ్గడంతో చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో లాభాలు వచ్చాయి.
నిన్న సెన్సెక్స్ 379.43 పాయింట్లు (0.64 శాతం) పురోగమించి 59,842.21 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ వరుసగా మూడవ రోజు లాభాలను నమోదు చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460.25 పాయింట్లు (0.77 శాతం) పెరిగి 59,923.03 వద్దకు చేరుకుంది.
వరుసగా ఆరో సెషన్లో తన లాభాల పరంపరను కొనసాగిస్తూ నిఫ్టీ 127.10 పాయింట్లు (0.72 శాతం) పెరిగి 17,825.25 వద్ద ముగిసింది.
జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయి 13.93 శాతానికి తగ్గిన తర్వాత ద్రవ్యోల్బణం ఆందోళనలు కొంత మేర తగ్గాయి. దీంతో ఇండెక్స్లో అగ్ర షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
‘ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం దేశీయ పెట్టుబడిదారులను ఆర్థిక పునరుద్ధరణ వేగంపై ఆశాజనకంగా ఉండేందుకు ప్రోత్సహించింది. ఊహించిన దానికంటే మెరుగైన గణాంకాలు, ఆహారం, ఇంధన ధరలు నెమ్మదిగా పెరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల పెంపుదలను పరిమితం చేయవచ్చు..’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
రూపాయి పటిష్టంగా ముందుకు..
ప్రపంచ వృద్ధి దృక్పథంపై ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో ఆయిల్ ధరలు ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత రూపాయి బుధవారం డాలర్తో పోలిస్తే అధిక స్థాయిలో ప్రారంభమవుతుందని అంచనా.
నాలుగు రోజుల సెలవుల తర్వాత తిరిగి ట్రేడింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న రూపాయి, శుక్రవారం డాలర్తో పోలిస్తే మారకం విలువ 79.25-79.30 వద్ద ప్రారంభమైంది.
ఇరాన్ చమురు ఎగుమతులను అనుమతించే ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చర్చలపై ట్రేడర్లు స్పష్టత కోసం వేచి ఉన్న తరుణంలో మంగళవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3% క్షీణించి బ్యారెల్కు 92 డాలర్లకు పడిపోయాయి.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ముందు కనిపించిన స్థాయిలో చమురు ధరలు వెనక్కి తగ్గడం వల్ల భారతదేశ రికార్డు వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణ రేట్లపై ఆందోళనలు తగ్గుతాయని భావిస్తున్నారు.
జూలైలో భారతదేశ వాణిజ్య లోటు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణం వరుసగా ఏడు నెలల పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎగువ సహన పరిమితి కంటే ఎక్కువగా ఉంది.
చమురు ధరల పతనంతో రూపాయి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చమురు ధరల తగ్గుదల, అధిక యూఎస్ ట్రెజరీ దిగుబడుల కారణంగా రూపాయి విలువ డాలరుతో పోల్చితే 78.50-80 వద్ద ట్రేడ్ అవ్వొచ్చని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం ముప్పు నుంచి బయటపడేందుకు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలను కొట్టి పారేయలేమని నిపుణులు అంచనా వేస్తున్నారు.