Singareni Officials Visit: స్టీల్ ప్లాంటులో సింగరేణి బృందం…కేసీఆర్ లక్ష్యం అదేన
Singareni Officials Visit: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లలో పాల్గొనడానికి సింగరేణి ఉన్నతాధికారుల బృందం విశాఖపట్నం చేరుకుంది. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి ఒడ్డెక్కించడానికి నిధులను సమీకరించేందుకు ఈఓఐ బిడ్లను ఆర్ఐఎన్ఎల్ ఆహ్వానించింది. దీంతో సింగరేణి బృందం విశాఖ చేరుకుంది.
Singareni Officials Visit: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం భాగస్వాముల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో సింగరేణి కాలరీస్కు చెందిన ముగ్గురు డైరెక్టర్లతో పాటు ఇద్దరు జిఎంలు విశాఖలో పర్యటిస్తున్నారు మంగళవారం స్టీల్ ప్లాంటులో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బుధవారం సిఎండితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సంస్థ కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో పాతిక లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ ఆపేశారని, సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించే లక్ష్యంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. ఇప్పటి వరకు ఏడు సంస్థలు ఆర్ఐఎన్ఎల్ భాగస్వాములు చేరడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. ఏడు సంస్థల్లో ఆరు సంస్థలు దేశంలో లక్షల కోట్ల రుపాయల ఐపిలు పెట్టిన ప్రైవేట్ సంస్థలు వచ్చాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ క్రమంలో సింగరేణికిచెందిన ముగ్గురు డైరెక్టర్లు, ఇద్దరు జిఎంలు వచ్చి చర్చలు జరుపుతుున్నారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ అవసరాలు తీరాలంటే కనీసం 5వేల కోట్ల రుపాయల పెట్టుబడులు అవసరమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.రూ. 5వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా ఆసక్తీ వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగరేణ బృందం ప్లాంటు పరిశీలనకు వచ్చారు. సింగరేణి ప్రతినిధులతో కూడిన బృందం బోర్డు రూములో, స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్లతో చర్చలు జరిపారు. బుధవారం కూడా వీరి పర్యటన కొనసాగనుంది. సిఎండి అతుల్ భట్తో బుధవారం సమావేశం కానున్నారు.
తెలంగాణ బృందం విశాఖలో పర్యటించడం వెనుక కేసీఆర్ మార్కు రాజకీయం కూడా కనిపిస్తోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టడం, రాజకీయంగా లబ్ది పొందే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోందనే వాదన లేకపోలేదు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు నిరంతరం పనిచేస్తేనే లాభాల బాటలోకి వస్తుంది. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి కనీసం 20లక్షల టన్నుల ముడి సరుకును ప్రొసెస్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముడిసరుకుతో పాటు నిర్వహణా వ్యయం సమీకరించుకోడానికి ఈఓఐకు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి యాజమాన్యం స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా దాని పరిమితులు ఎంత వరకు అనే సందేహాలు లేకపోలేదు.
సింగరేణి సామర్థ్యంపై సందేహాలు…
ప్రస్తుత అవసరాల రీత్యా విశాఖ స్టీల్ ప్లాంటు 5వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాల్సి ఉన్న నేపథ్యంలో సింగరేణి ఏ మేరకు ఆ పని చేయ గలుగుతుందనే సందేహాలు లేకపోలేదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కార్మికుల నిరంతర పోరాటాల వల్ల కేంద్రం వెనకడుగు వేస్తోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
ఈఓఐలో జిందాల్, భూషణ్ స్టీల్ వంటి సంస్థలు ముందుకొచ్చారని, దేశంలో ఇల్లీగల్ మైన్స్ చేసిన వారు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షా 70వేల కోట్లు ఎగ్గొట్టిన సంస్థలు స్టీల్ ప్లాంటుకు ముడి సరుకు సప్లై చేస్తామని వచ్చారని, క్రమంగా సంస్థను నష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానిని తిప్పి కొడతామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయితే పెట్టుబడులతో పాటు, కోకింగ్ కోల్ ఇచ్చే సామర్ధ్యం సింగరేణికి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
అయితే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెయిల్ వంటి సంస్థల నుంచి ఆర్ఐఎన్ఎల్కు ఉపయోగం ఉంటుందని వివరించినట్లు కార్మిక సంఘాలు చెప్పారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంటును 7కంపెనీలు పరిశీలించాయని, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సంస్థలు రావడంతో, ప్రభుత్వ సంస్థలను మాత్రమే అనుమతించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సింగరేణి నుంచి ఉక్కు తయారీకి బొగ్గు అందించాలని ప్రతిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు విక్రయించాలని ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. జేఎస్డబ్ల్యూ, జేఎస్పిఎల్ వంటి సంస్థలను దొడ్డి దారిన ప్రవేశపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు రావడం కేంద్రానికి మింగుడు పడని విషయమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయితే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసే సమయానికి ప్రభుత్వ సంస్థలను తప్పించేలా నిబంధనలు రూపొందిస్తారని ఆరోపిస్తున్నారు.
కేరళలో ఎయిర్ పోర్ట్ను తామే నిర్వహిస్తామని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం, అనుబంధ సంస్థలు బిడ్డింగ్లోకి రాకుండా ఆంక్షలు పెట్టారని, టెండర్ డాక్యుమెంట్ తయారు చేసే వరకు ప్రభుత్వ సంస్థలను అనుమతిస్తారా లేదా అనేది చూడాలని కార్మిక నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధమేనా….
విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే, ప్రస్తుతం హైదరాబాద్లో వైజాగ్ స్టీల్స్ అమ్మకాలు బాగున్నాయని, అది వారికి లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ ఈఒఐ ద్వారా 150-200కోట్ల విలువైన సెమీ స్టీల్ను సింగరేణికి ఇచ్చే ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. నిజానికి ఓపెన్ బిడ్డింగ్లో ఎన్ఎండిసి వంటి సంస్థలు బిడ్లు వేస్తే బాగుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ఎండిసి, సెయిల్ వంటి సంస్థలు స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్లో పాల్గోనే అవకాశం లేదని, ఈఓఐలో పాల్గొనడానికి అవకాశం ఉందన్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖలోనే ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండిసి, సెయిల్ వంటి సంస్థలు ఉన్నా, వాటితో బిడ్డింగ్ చేయించకపోవడం కుట్రేనని కార్మిక సంఘాలు డిమాండ్ ఆరోపిస్తున్నాయి.
ఐరన్ ఓర్ , కోకింగ్ కోల్, రైల్వే ర్యాక్లు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుండటం వల్లే ముడి సరుకు ఎవరు ఇచ్చినా ఇనుము ఇస్తామని ఆసక్తీకరణకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. సింగరేణ వద్ద బాయిలర్ కోల్ ఇస్తామని ప్రతిపాదన చేసిందని, దానితో పాటు రూ.2వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ సమకూరిస్తేనే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం తరపున బిడ్డింగ్లో పాల్గొనాలనే ప్రతిపాదన వచ్చిందని అయితే నిబంధనలు అనుగుణంగా లేవని చెబుతున్నారు.
రాజకీయంగా కేసీఆర్ సక్సెస్ అయినట్లే…
ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తి వ్యక్తీకరణ, టెండర్ల దశ వరకు వెళ్లినా అందుకు అనుగుణమైన నిబంధనలను కేంద్రం ఎంతవరకు అమలు చేస్తుందనే సందేహాలు లేక పోలేదు. కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజిక్ సేల్ నియమ నిబంధనలు సింగరేణి యాజమాన్యానికి అనుకూలంగా లేకపోయినా కేసీఆర్కు వచ్చే నష్టం ఏమి ఉండకపోవచ్చు. రాజకీయంగా మాత్రం కావాల్సినంత మైలేజ్ మాత్రం దక్కుతుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రదర్శిస్తున్న దూకుడు వైఖరితో మాత్రం బీజేపీతో పాటు ఏపీలో అధికార పార్టీ ఇరకాటంలో పడ్డాయి.