AP High Court : కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్న హిందూపురం సీఐ, హైకోర్టు సీరియస్
AP High Court : ఓ వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలపై విచారణకు వెళ్లి జ్యుడీషియల్ అధికారులపై సీఐ చేయి చేసుకున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు..సుమోటోగా పిల్ నమోదుకు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది.
AP High Court : కోర్టు సిబ్బందిపై సీఐ చేయి చేసుకున్న ఘటనపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సుమోటోగా విచారణ చేపట్టింది. హిందూపురం 1వ పట్టణ సీఐ ఇస్మాయిల్ ఓ కేసులో విచారణలో అడ్వకేట్ కమిషనర్గా వెళ్లిన న్యాయవాది, కోర్టు సిబ్బందిపై సీఐ చేయి చేసుకున్నారు. జ్యుడీషియల్ అధికారిపై దాడి తీవ్రంగా పరిగణించిన కోర్టు... సీఐ కోర్టు విధులను ఆటంకపరచడమేనని అభిప్రాయపడింది. సీఐపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అసలేం జరిగింది?
పోలీసులు గిరీష్ అనే వ్యక్తిని అక్రమ నిర్బంధించారన్న ఆరోపణలపై స్థానిక కోర్టు న్యాయవాది పి.ఉదయ్ సింహారెడ్డిను జ్యుడీషియల్ అధికారిగా నియమించింది. పోలీసుల నిర్బంధంలో ఉన్న వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్ 21న హిందూపురం పోలీస్ స్టేషన్ కు అడ్వకేట్ కమిషనర్ ఉదయ్ సింహారెడ్డి వెళ్లారు. గిరీష్ ను పోలీసులు అక్రమ నిర్బంధించి, కొట్టినట్లు జ్యుడీషియల్ అధికారులు గుర్తించారు. గిరీష్ను కోర్టు ముందు హాజరుపర్చేందుకు తీసుకెళ్తామని చెప్పగా... సీఐ ఇస్మాయిల్ అడ్వకేట్ కమిషనర్ పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు.
అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో వ్యాజ్యంగా మలిచింది హైకోర్టు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్ ను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్ పై సోమవారం విచారణ జరిగింది.
కోర్టు ధిక్కరణ చర్యలు
ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు గతంలో సీఐ ఇస్మాయిల్ ను వివరణ కోరింది. అయితే సీఐ నుంచి సరైనా సమాధానం రాకపోయే సరికి... డీజీపీ రెండు వారాల్లో వివరణ కోరాలని, అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై డీజీపీ నుంచి సమాధానం రాలేదని న్యాయమూర్తికి రిజిస్ట్రీ తెలియజేసింది. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సీఐ ఇస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
సీఐపై చర్యలు
జ్యుడీషియల్ సిబ్బందిపై దాడి తీవ్రమైన విషయంగా హైకోర్టు భావించింది. ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందని సుమోటో పిల్గా పరిగణించాలని నిర్ణయించింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వుల కోసం ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీని ఆదేశించారు. విషయం పెద్దదవ్వడంతో డీజీపీ స్పందిస్తూ బాధ్యులెన పోలీసులకు శిక్ష విధించామన్నారు. రెండేళ్ల పాటు సీఐకు ఇంక్రిమెంట్స్ నిలిపివేశామని హైకోర్టు తెలిపారు.