Goshamlahal Politics: రాజాసింగ్ అడ్డాలో సరికొత్త రాజకీయం.. అసలేం జరగబోతోంది..?
Goshamlahal Assembly Constituency: కొద్దిరోజుల కిందట బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఓ కేసులో జైలుకు వెళ్లిన ఆయన.. బయటికి కూడా వచ్చారు. ప్రస్తుతం సొంతంగానే ముందుకెళ్తున్నారు. అయితే బీజేపీ మాత్రం సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. పైగా పెద్దగా పట్టించుకున్నట్లు కూడా కనిపించటం లేదు. ఫలితంగా గోషామహల్ అడ్డాలో అనేక ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి.
Goshamlahal Politics: గోషామహల్... నాడు కాంగ్రెస్... నేడు బీజేపీ..! సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్..! గోషామహల్ అంటే రాజాసింగ్ అన్నట్టు ఉంటుంది కథ..! కానీ సీన్ మారుతోంది. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ అయ్యాక.... తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు వచ్చేస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో యువ నేత... వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారట..! నిజానికి రాజాసింగ్ జైలుకు వెళ్లిన సమయంలోనే దీనిపై తెగ వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఫలితంగా అసలు గోషామహల్ లో ఏం జరుగుతోంది...? జరగబోతుందనేది..? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పట్టించుకోవటం లేదా..?
ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కమలం పార్టీ. జైలుకి వెళ్లి వచ్చిన ఆయన.. కిందట బయటికి వచ్చారు. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని అందరూ భావించారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి పెద్దగా స్పందన లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన వైఖరితో పార్టీకి కూడా చాలాసార్లు ఇబ్బందులు రావటం, చాలా మంది నేతలతో సఖ్యత లేకపోవటంతో కమలం పెద్దలు మరోలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ రాజాసింగ్ మాత్రం.. నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారు.
రంగంలోకి యువ నేత...!
ఇదే స్థానంపై బీజేపీలో ఉన్న యువ నేత విక్రమ్ గౌడ్ కన్నేశారు. ఇతను గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా విక్రమ్ గౌడ్ కూడా చాలా రోజుల పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ అనంతరం బీజేపీలో చేరారు. ఆయనకంటూ ఓ వర్గం ఉంది. ఈ సీటుపై ఆశగా ఉన్నప్పటికీ... రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు నుంచి రెండుసార్లు రాజాసింగే గెలిచారు. వచ్చేసారి కూడా ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. కానీ... ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. సరిగ్గా ఈ పరిణామమే విక్రమ్ గౌడ్ ఛాన్స్ కు గా మారినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ జైలులో ఉన్నప్పటి నుంచే విక్రమ్ గౌడ్... లైన్ లోకి వచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే మళ్లీ బలపడుతున్నాయి. మరోవైపు రాజాసింగ్ సొంత కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలా కుదరకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారని తెలుస్తోంది.
గోషామహల్ లోని తాజా రాజకీయ పరిణామాలపై రాజాసింగ్ ఓపెన్ కావటం లేదు. ఇక విక్రమ్ గౌడ్ నుంచి రియాక్షన్ లేదు. ఈ నేపథ్యంలో ....రాజాసింగ్ స్వతంత్రంగా బరిలో ఉంటారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ నిజమేనా..? నిజంగానే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా వదులుకుంటుందా..? వచ్చే ఎన్నికలో విక్రమ్ గౌడే బరిలో ఉంటారా..? అనేది తేలాల్సి ఉంది. వీటన్నింటికి భవిష్యత్ పరిణామాలతోనే సమాధానం దొరికే ఛాన్స్ ఉంది.