Revanth Reddy | కేసీఆర్ దత్తత గ్రామంలో పాస్ పుస్తకాలు పంచుతాం.. మల్లారెడ్డిని జైలుకు పంపుతాం
మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భూకబ్జాలు, అక్రమాలపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో పాస్ పుస్తకాలు లేకపోవడం కారణంగా రైతులకు పథకాలు అందడం లేదని చెప్పారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భాంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దత్తత గ్రామం.. మూడు చింతలపల్లి అని.. ధరణి పోర్టల్ ను ఇక్కడే ప్రారంభించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ గ్రామంలోనే ధరణిలో అనేక సమస్యలున్నాయని వ్యాఖ్యానించారు.
'మూడు చింతల గ్రామంలో 582 మందికి ఖాతా నెంబర్లు లేవు. రెవెన్యూ నక్ష లేదు. గ్రామంలో రైతు బంధు పథకం అమలు చేయడంలేదు. రైతు బీమా రావడం లేదు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి టీ పన్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలి.' అని రేవంత్ రెడ్డి సూచించారు.
అయితే మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి, ఆయన బావమరిది భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని రేవంత్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ రోడ్డు వేస్తే లక్ష్మపూర్ గ్రామంలోని కుమ్మరి ఎల్లవ్వ ఇల్లు పోయిందని రేవంత్ తెలిపారు. ఒక్క ఇల్లు కట్టిస్తే ఏం అవుతుందని ప్రశ్నించారు. 'కలెక్టర్ వెంటనే ఎల్లవ్వకు ఇల్లు కట్టివ్వకపోతే కాంగ్రెస్ తగిన గుణపాఠం చెబుతుంది. ప్రభుత్వం ఇల్లు కట్టించకపోతే కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీస్కుంటుంది. ఈ గ్రామంలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఇక్కడే నక్ష లేదు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. నెల రోజుల్లో ఇదే గ్రామంలో అందరికీ పాసు పుస్తకాలు ఇస్తాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల వద్దకు వచ్చి రూ.2500 చొప్పున క్వింటాల్ ధాన్యం కొంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొంటామమి తెలిపారు. కూరగాయలు, పండ్లు కూడా మంచి ధరలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ రైతులకు న్యాయం చేయని వ్యక్తి.. పంజాబ్ వెళ్లి ఎలాగబెడుతాడట అని రేవంత్ విమర్శించారు. ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇతర ప్రాంతాలకు పోతే అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటిస్తే తెలంగాణ సంతోషంగా ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.