TRS MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
TRS MLA's Buying Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో టీమ్ పని చేయనుంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్(SIT) ఏర్పాటైంది. ఏడుగుడు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మెుయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసును ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఇటీవల సీఎం కేసీఆర్(CM KCR) మీడియా సమావేశం పెట్టారు. న్యాయస్థానాలకు, అన్ని పార్టీల అధినేతలకు దీనికి సంబంధించిన వీడియోలు పంపిస్తానని తెలిపారు. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి మంచివి కావని పేర్కొన్నారు. ప్రభుత్వాలను కూల్చాలని ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
మరోవైపు ఈ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు మెుయినాబాద్ పోలీసు(Moinabad Police)లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం(High Court).. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ప్రస్తుతానికి బీజేపీ(BJP)కి చెందినవారెవరూ నిందితులుగా లేరని చెప్పింది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ స్థితిలో దర్యాప్తును వాయిదా వేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించలేమని న్యాయస్థానం పేర్కొంది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని ఆదేశాలు ఇచ్చింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఇంకోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి(Ramachandra Bharathi)పై మరో కేసు నమోదైంది. రామచంద్రభారతి నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్(Pan Card), డ్రైవింగ్ లైసెన్స్(driving licence)లు మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి తన వద్ద పెట్టుకున్నారని టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
వీటి ఆధారంగా రెండు రోజుల క్రితమే పోలీసులు రామచంద్రభారతిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నేరం రుజువైతే రామచంద్రభారతికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇటీవల మీడియా సమావేశంలోనూ సీఎం కేసీఆర్(CM KCR) రామచంద్రభారతి పలు మోసాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు(TRS MLAs Poaching Case)లో రామచంద్రభారతి, నంద కుమార్, సింహయాజీలను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.