Shamshabad Airport Drugs : సూట్కేసు అడుగున రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ అరెస్ట్!
Shamshabad Airport Drugs : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. మాలావి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ వద్ద 5.9 కిలోల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు గుర్తించి, సీజ్ చేశారు.
Shamshabad Airport Drugs : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మలావి నుంచి వచ్చిన మహిళ వద్ద 5.9 కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ రూ. 41.3 కోట్ల విలువ ఉంటుందని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. మాలావి నుంచి హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సూట్కేసు అడుగు భాగంలో డ్రగ్స్ సీక్రెట్ తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళ అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. ఆమెను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. సదరు మహిళపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సూట్ కేసులో సీక్రెట్ గా
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీల్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఈ నెల 7న ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకుంది. డీఆర్ఐకు అందిన సమాచారంతో... శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఆమెను లగేజ్ ను తనిఖీ చేశారు. ఆమె తన వెంట తీసుకొచ్చిన సూట్కేసులో 5.9 కిలోల క్రీమ్ రూపంలో ఉన్న తెల్లటి పౌడర్ను అధికారులు గుర్తించారు. ఈ పౌడర్ ను నార్కోటిక్స్ ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా పరిశీలించగా... అది హెరాయిన్ అని తేలింది. మార్కెట్లో దాని హెరాయిన్ విలువ దాదాపు రూ.41.30 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అంచనా వేసింది. ఆ మహిళ మాలావి నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ ను స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకుందని డీఆఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తంగా హెరాయిన్ను స్మగ్లింగ్ కు పాల్పడడంపై అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎవరిచ్చారు, ఎవరికి చేరవేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఇటీవల భారీగా బంగారం సీజ్
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల భారీగా గోల్డ్ పట్టుబడింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.16.5 లక్షల విలువైన 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లలో గోల్డ్ దాచి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారాన్ని గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఇటీవలె మరో ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళలు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిరేట్స్ ఈకే 527 విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వచ్చిన నలుగురు మహిళలు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు గుర్తించారు. మహిళలను స్కానింగ్ చేయగా వారి ప్రైవేట్ భాగాల్లో బంగారం ఉన్నట్లు తేలింది. వారిని ఆసుపత్రికి పంపి ఆపరేషన్ చేసి బంగారాన్ని బయటకు తీశారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. కోటి 94 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మహిళలపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.