Godavari Floods : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతీ మండలానికి సీనియర్ అధికారిని నియమంచి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. ప్రతీ గ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్, తదితర విభాగాల బృందాలను ప్రత్యేకంగా నియమించి సమర్థవంతంగా పునరావాస చర్యలను కొనసాగిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 4100 మంది శానిటేషన్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి తరలించి సహాయ పునరావాస చర్యలను చేపట్టామని సీఎస్ చెప్పారు. మున్సిపల్ శాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బంది, మొబైల్ టాయిలెట్లు, ఇతర ఎమెర్జెన్సీ సామాగ్రిని తరలించామన్నారు. ప్రతీ గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయితీ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించి శానిటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా తెలిపారు.
భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లతోపాటు తోపాటు పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సీఎస్ సోమేశ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం 436 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సదుపాయాలూ అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 10,000 మందికి పైగా వైద్య చికిత్సలు అందించినట్టుగా చెప్పారు.
'ఇప్పటి వరకు ఏ విధమైన మలేరియా, డెంగ్యూ కేసులు గానీ నమోదు కాలేదు. ప్రతీ మండలానికి ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లా మలేరియా అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నాం. గర్భిణీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వైద్యసదుపాయం అవసరమైనవారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాం. ప్రతీ పునరావాస కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. అన్ని గ్రామాల్లో విధ్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. ప్రతీ మండలానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లా అధికారులు సహాయ పునరావాస చర్యలలో సమర్థవంతంగా పాల్గొనడం పట్ల ప్రజలు అభినందిస్తున్నారు.' అని సోమేశ్ కుమార్ చెప్పారు.
సంబంధిత కథనం