Bio Asia 2023 : లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా...-minister ktr briefs about bio asia 2023 says target is to create 8 lakhs jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Briefs About Bio Asia 2023 Says Target Is To Create 8 Lakhs Jobs

Bio Asia 2023 : లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా...

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 05:32 PM IST

Bio Asia 2023 : జీవశాస్త్ర రంగంలో 2028 నాటికి రాష్ట్రంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు హైదరాబాద్ లో బయో ఆసియా సదస్సు జరగనున్న నేపథ్యంలో.. సదస్సు ప్రాముఖ్యతను వివరించిన కేటీఆర్.... భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండబోతోందని తెలిపారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (facebook)

Bio Asia 2023 : 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని.. మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల విలువ కలిగిన లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంను రెట్టింపు చేస్తామని.... ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ప్రస్తుత ఉద్యోగాల సంఖ్యను రెట్టింపు చేసి 8 లక్షలకు చేరుస్తామని చెప్పారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్ వేదికగా.. బయో ఆసియా సదస్సు జరగనున్న నేపథ్యంలో.... విలేకరులతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. బయో ఆసియా ప్రాముఖ్యతతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను కేటీఆర్ వివరించారు.

19 సదస్సులను పూర్తిచేసుకుని ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నామన్నారు కేటీఆర్.‘ ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’’ అనే ఇతివృత్తంతో 20వ బయో ఆసియా సదస్సు జరుగుతుందని చెప్పారు. బయో ఆసియా... గత పంతొమ్మిది ఏళ్లలో మూడు బిలియన్ డాలర్లు.. అంటే సుమారు 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లయని పేర్కొన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఆసియా విస్తృతమైన సేవలను అందించిందన్న కేటీఆర్... దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందని చెప్పారు.

వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలు.... 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు. 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలలో 250 కి పైగా అవగాహన ఒప్పందాలను ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందని... ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య దేశాల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయన్నారు. ఈ సారి కూడా పలు దేశాలు బయోఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఉందని వివరించారు. ఈ సారి సదస్సులో తొలిసారి ఆపిల్‌ కంపెనీ కూడా పాల్గొంటోందన్నారు.

జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ ఫార్మసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయో ఆసియా తోపాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2021లో హైదరాబాద్‌ దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్‌ డాలర్లు ఉండగా 2028 నాటికి దీన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండబోతోందని తెలిపారు.

జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, న్యాయమూర్తులు రిజర్వ్‌ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని, ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందని మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 1400 కోట్లకు చేరుతుందని, ‍టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లోనే ఏర్పాటు కానుంది అన్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూండటం కూడా జీవశాస్త్ర రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మసిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని విమర్శించారు. పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్న హామీలను ఇచ్చుకుంటూ వెళ్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాల్లో డిఫెన్స్ కారిడార్లను, బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడం వలన కేంద్రం దేశ అభివృద్ధిని పణంగా పెడుతోందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుకున్న బల్క్ డ్రగ్ పార్క్ ను ఇవ్వకున్నా, హైదరాబాద్ ఫార్మసిటీకి సహాయం చేయకున్నా, ఐటిఐఆర్ రద్దు చేసినా.... ఆయా రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కేటీఆర్ తెలిపారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని వెల్లడించారు.

IPL_Entry_Point