KCR NEW POLITICAL PARTY BRS : బిఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్...
గులాబీ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ స్ఫూర్తితో భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులతో కేసీఆర్ సమాలోచనలు జరిపారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందళోనలు జరిగిన సమయంలో టిఆర్ఎస్ నేతల భేటీలో కీలక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దేశంలో అభివృద్ధి స్థానంలో విద్వేషాలు, అపోహలతో రాజకీయాలు జరుగుతుండటంపై నేతల మధ్య చర్చ జరిగింది.
దేశమంతటా మత విద్వేషపు రాజకీయాలతో ప్రజలు నష్టపోతున్నారని నాయకులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని బాగు చేసేందుకు, బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ నేతృత్వంలో పోరాడాలని ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్కు సూచించారు. క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్న భేటీలో మోదీకి ధీటుగా పోరాడాలంటే కేసీఆర్ ఒక్కరే సమర్ధులనే అభిప్రాయం వ్యక్తమైంది. 75ఏళ్ల స్వాతంత్య్రంలో గుణాత్మక మార్పు రాకపోగా జాతీయ పార్టీలు సాధించిందేమి లేదని అభిప్రాయపడ్డారు.
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్, దాని రూపకర్త కేసీఆర్ కీలక పాత్ర పోషించాల్సి సమయం ఆసన్నమైందని నాయకులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల అకాంక్షలను నెరవేర్చడంలో కూడా ముందుండాలని కోరారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే భారతదేశ పునర్నిర్మాణం, పునరుజ్జీవానికి మరో ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
జాతీయ స్థాయి ఉద్యమానికి కేసీఆర్ నేతృత్వం వహించాలని సమావేశానికి హాజరైన నేతలంతా అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల అకాంక్షలు నెరవేర్చడానికి అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటుకు కూడా వెనుకాడవద్దని సూచించారు. మోదీ నాయకుడిగా విఫలమయ్యాడని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేవచచ్చిపోయిన నేపథ్యంలో రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి కేసీఆర్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడమే సరైన మార్గమని నేతలు అభిప్రాయపడ్డారు.
దేశంలో ఫ్రంట్లు, సంకీర్ణల కాలం ముగిసిందని వాటితో ప్రజలు విసిగిపోయారని తెలంగాణ నాయకులు అభిప్రాయపడ్డారు. భావసారూప్య పక్షాలను కలుపుకుని జాతీయ పార్టీని ఏర్పాటు చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రయోగాలు గతంలోనే విఫలమయ్యాయని దేశప్రజలు వాటితో విసిగిపోయి ఉన్నారని భేటీకి హాజరైన నేతలు అభిప్రాయపడ్డారు.
కప్పల తక్కెడ, కలగూర గంప వంటి రాజకీయాలతో అధికారం కోసం కొట్లాడుకోవడం తప్ప దేశాన్ని మార్చే రాజకీయాలు మాత్రం జరగవన్నారు. ఫ్రంట్లను నమ్మే పరిస్థితులు లేనందున జాతీయ స్థాయిలో ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఉత్తమమని నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీ ఏర్పాటు తెలంగాణ రాస్ట్రం నుంచి జరగాలని, దేశంలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని విజ్ఞప్తి చేశారు.
ఇంగ్లీష్, హిందీలలో అనర్ఘళంగా మాట్లాడగలగడం, దేశ వ్యాప్తంగా అమోదం ఉన్న నాయకుడు కావడం వల్ల అన్ని అనుకూలిస్తాయని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఎదిరించడానికి సరైన నాయకుడు కేసీఆర్ అని సమావేశానికి హాజరైన నాయకులంతా అభిప్రాయపడ్డారు. అన్నీ అనుకూలిస్తే మరికొద్ది రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొత్త పార్టీ జెండా రంగు, గుర్తులపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసే పార్టీకి భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తారని, పార్టీ జెండాలో దేశ చిత్రపటాన్ని ఉంచుతారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయంగా నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన వారం పదిరోజుల్లో ఉండొచ్చని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
టాపిక్