Jai Ram Ramesh : మునుగోడులో పోటీ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే…
Jai Ram Ramesh మునుగోడు ఎన్నికలలో పోటీ కాంగ్రెస్-టిఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని ఎన్నికల ఫైట్ రెండు పార్టీల మధ్యే ఉంటుందన్నారు.
Jai Ram Ramesh తెలంగాణలో బీజేపీ జీరో అని మునుగోడులో ఎన్నికల ఫైట్ కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్యే ఉంటుందన్నారు జైరామ్ రమేష్. ఎన్నికల ఫైట్ రెండు పార్టీల మధ్యే కొనసాగుతుందని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఎంపీ వెంకటరెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో జైరామ్ రమేష్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా వెళ్లిపోవచ్చన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ వాషింగ్ మిషన్లో చేరి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్ మూలంగా రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. దివాళా తీసిన రాష్ట్రంలో రాహుల్ దీపావళి ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఎనిమిదో నిజాం అని, మోడీ ఔరంగజేబులాంటి వాడని ఎద్దేవా చేశారు. ఈ సారి ఎన్నికలతో కేసీఆర్కు విఆర్ఎస్ తప్పదన్నారు. 24,25,26 తేదీల్లో రాహుల్గాంధీ యాత్రకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాహుల్ యాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. మొత్తం 11రోజులు తెలంగాణలో యాత్ర సాగుతుందని నవంబర్ 8న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని జైరామ్ రమేష్ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయని, ఆంధ్రాలో మాత్రం పూర్తిగా దెబ్బతిన్నామని చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఓట్లు వచ్చాయని చెప్పారు. అదే సమయంలో బీజేపీకి అలాంటి పరిస్థితులు లేవన్నారు. 119 స్థానాల్లో బీజేపీకి అభ్యర్ధులు లేరని, కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాజనకంగా ఉందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందన్నారు.
కాంట్రాక్టులు ఉన్న వారు నాయకులు కాదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తమ పార్టీని వీడి ఎవరు వెళ్లినా అభ్యంతరం లేదని, పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేయొద్దన్నారు.