Cold Wave in Telangana: పడిపోతున్న ఉష్ణోగ్రతలు… వణికిస్తున్న చలి
Telangana Weather Updates: తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరిగింది. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరిగటం మొదలైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమై వెచ్చని దుస్తులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలను బయటకు పంపించొద్దని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. కొన్ని జిల్లాల పరిధిలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి.
Cold Wave in Hyderabad: ఇటు హైదరాబాద్ నగరంలోనూ చలి ఎక్కువగానే ఉంది. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రయాణాలు మంచివి కావని అధికారులు చెబుుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తిరుమలలో వర్షం...
తిరుమలలో వర్షంతోపాటు చలి తీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తులు టీటీడీ పీఏసీలు, షెడ్లలో వేచి ఉన్నారు. విద్యార్థులకు వరుస సెలవులతో భారీగా వాహనాల్లో భక్తులు రావడంతో రద్దీ పెరిగింది. చెక్ పాయింట్లో ఉన్న 12 క్యూలైన్లలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో దర్శనానికి ఆలస్యమవుతోంది. దట్టమైన పొగమంచు... చిరు జల్లుల మధ్య భక్తులు వణికిపోతున్నారు. తిరుమలలో మూడు రోజులుగా చిరు జల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. విశాఖ మన్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.