NTR Centenary Celebrations : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్
NTR Centenary Celebrations : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ... ఎన్టీఆర్ సేవలను గుర్తుచేశారు.
NTR Centenary Celebrations : తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మనవడు జూ.ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ పలువురు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ అందని శిఖరంలా నిలిచారన్నారన్నారు. ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రూ.2కే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం
ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు.
నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్
హుస్సేన్ సాగర్ వద్ద గల ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఘాట్ వద్ద అభిమానులు భారీగా చేరుకోవడంతో జూ.ఎన్టీఆర్ కాసేపు ఇబ్బంది పడ్డారు. జూ.ఎన్టీఆర్తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీంతో నివాళులర్పించేందుకు జూ.ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అభిమానులపై జూ.ఎన్టీఆర్ అసహనం వ్యక్తంచేశారు. తాతయ్యకు ఎన్టీఆర్ నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కుమారుడు నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ తీసుకోచ్చారన్నారు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలు నేడు దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ ఘాట్ను తారక్ సందర్శించే క్రమంలో అభిమానులు 'సీఎం సీఎం' అంటూ నినాదాలు చేశారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూ.ఎన్టీఆర్ హాజరుకాలేదు. దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఇతర హీరోలు వచ్చినప్పటికీ తారక్ రాకపోవటంతో అభిమానులు రెండుగా విడిపోయి నెట్టింట విమర్శలు చేసుకున్నారు.