BRS : స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. మహారాష్ట్రలో మరో భారీ సభ, మహుర్తం ఫిక్స్
BRS Meetings in Maharastra: జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సభలు తలపెట్టగా… మూడో సభను కూడా ఖరారు చేశారు కేసీఆర్.
BRS Public Meeting in Aurangabad: తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో కార్యక్రమాలను ప్రారంభించగా… త్వరలోనే సభకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే… మహారాష్ట్రపై తెగ ఫోకస్ చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించగా… మరో భారీ సభను నిర్వహించేందుకు ముహుర్తం ఖరారు చేశారు.
ఈసారి ఔరంగాబాద్లో…
ఈసారి ఔరంగాబాద్లో సభను తలపెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు లక్షన్నర మందితో మరో భారీ సభ నిర్వహించేలాని నేతలను ఆదేశించారు. ఏప్రిల్ 24న సభ నిర్వహణకు డేట్ ఫైనల్ చేశారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు గ్రౌండ్ లో మక్కాం వేశారు. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు సభలను మించి విజయవంతం చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు కూడా కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక సభలో కూడా భారీ వీడియో స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.
రెండు సభలు సక్సెస్…
ఇక బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత…. మహారాష్ట్రలో ఇప్పటి వరకు రెండు సభలను నిర్వహించారు. నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సభను ఏర్పాటు చేయగా… రెండోది మార్చి 26వ తేదీన కంధార్ లోహా తలపెట్టారు. ఈ రెండు సభకు అక్కడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ రెండు సభలకు హాజరైన కేసీఆర్.. అక్కడివారిని ఆకట్టుకునేలా ప్రసంగించారు. ముఖ్యంగా కంధార్ లోహా వేదికగా కీలక ప్రకటన కూడా చేశారు. మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్తులపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ మోడల్, రైతుబంధు, రైతుబీమాతో పాటు పలు అంశాలను కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మూడో సభలోనూ కేసీఆర్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది.
ఇక మహారాష్ట్ర విషయంలో కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సభలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. చేరికల సంఖ్యను కూడా పెంచే పనిలో పడ్డారు. ముఖ్యంగా రైతు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరారు. మొత్తంగా మహారాష్ట్రలో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్… రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం