November 27 Telugu News Updates: బస్సులో చెలరేగిన మంటలు
- తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Sun, 27 Nov 202205:38 PM IST
బస్సులో చెలరేగిన మంటలు
అల్లూరి జిల్లాలో బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులకు ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అరకు పర్యటనకు వచ్చారు విజయనగరం జిల్లా వాసులు. ఘాట్ రోడ్డులోని టైడా వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించి పర్యాటకులు దిగిపోయారు. ఈ సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Sun, 27 Nov 202202:25 PM IST
నల్గొండకు సీఎం కేసీఆర్
నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జెన్కో అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావులు, జెన్కో అధికారులతో కలిసి ఏర్పాట్లను చూశారు.
Sun, 27 Nov 202210:34 AM IST
డ్రైవర్ ఆత్మహత్యపై సజ్జనార్ క్లారిటీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోడ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. డ్రైవర్ రాజయ్య అభ్యర్థన మేరకు మూడు నెలల కిందట.. జేబీఎస్కు బదిలీ చేశామన్నారు. ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఏకపక్ష వార్తలు ప్రచురించడం సరికాదన్నారు. ఆత్మహత్యపై విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని పోలీసులను కోరారు.
Sun, 27 Nov 202207:48 AM IST
ఆగ్రా టూర్…
IRCTC Tour From Hyderabad: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు సరికొత్త ఆఫర్లతో కూడా ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ వెళ్లే వారికోసం ప్యాకేజీని తీసుకువచ్చింది. 'GOLDEN TRIANGLE' పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అత్యంత అందమైన తాజ్ మహల్ తో పాటు పలు ప్రాంతాలను సందర్శించవచ్చు.
Sun, 27 Nov 202206:37 AM IST
సంజయ్ సంగ్రామ యాత్ర….
రాష్ట్రవ్యాప్తంగా పలు విడతల్లో పాదయాత్ర చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి చేసిన ఆయన... తాజాగా ఐదో విడతకు సిద్ధమయ్యారు. ఇక ఈ పాదయాత్ర రేపటి (నవంబర్ 28) నుంచి షురూ కానుంది.
ఐదో విడత పాదయాత్ర భైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుంది. 3 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ఇదిలా ఉంటే భైంసాలో రేపటి ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస హాజరుకానున్నారు. ఈ పాదయాత్ర నిర్మల్, ఖానాపూర్, వేముల వాడ, జగిత్యాల, చొప్పదండి మీదుగా సాగి కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుంది. మరోవైపు పాదయాత్ర కోసం ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Sun, 27 Nov 202206:02 AM IST
డేట్లు వచ్చేశాయ్….
telangana police constable ans si events 2022: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ) లాంటి వాటిని డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించేందుకు 11 కేంద్రాలను ఎంపిక చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట ప్రాంతాల పేర్లను వెల్లడించింది. ఈవెంట్స్ ప్రక్రియను 23 - 25 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. జనవరి తొలి వారం వరకు పూర్తి చేస్తామని తెలిపింది.
అభ్యర్థులు ఈనెల 29 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 3 వ తేదీ అర్ధరాత్రి వరకు వీటిని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. www.tslprb.in ద్వారా వీటిని పొందవచ్చని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే... support@tslprb.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చని వివరించారు. లేకపోతే ఈ ఫోన్ నెంబర్లను (93937 11110 or 93910 05006) సంప్రదించవచ్చు.
Sun, 27 Nov 202204:50 AM IST
ఫ్లైట్ రెస్టారెంట్….
నైట్ డిన్నర్ కు వెళ్దామా..? ఎక్కడైతే బాగుంటుంది..? ట్రైన్ రెస్టారెంట్ కు వెళ్దామా..? జైల్ రెస్టారెంట్ లో భోజనం చేద్దామా..? ఇలా ప్రతిరోజూ వేలాదా మంది బయటికి వెళ్తూనే ఉంటారు. ఇక హైదరాబాద్ లో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల థీమ్ లతో ఆహార ప్రియులను ఆకట్టుకునేలా నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా పిస్తా హౌస్ రెస్టారెంట్ వాళ్లు... సరికొత్త అనుభూతిని కల్పించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా ఫ్లైట్ రెస్టారెంట్ని మరికొద్దిరోజుల్లోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడింది.
షామీర్ పేట్ ప్రాంతంలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ను ప్రారంభిస్తున్నారు. దీనికోసం ఎయిర్ ఇండియా సంస్థ నుంచి మొట్టమొదటి ఎయిర్ బస్ - 320 పాత విమానాన్ని కొనేసింది పిస్తా హౌస్ రెస్టారెంట్. ఇందుకు 75 లక్షలకు పైగా ఖర్చు చేశారు. దీన్ని హైదరాబాద్ కు కూడా తీసుకొచ్చారు. జంటనగరాల ప్రజలకు బ్రాండ్ నేమ్తో ఉన్న బిర్యానీతో పాటు ఫ్లైట్ అనుభూతిని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్ల కోసం మరో 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
Sun, 27 Nov 202202:54 AM IST
సీట్ల కేటాయింపు…
లా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఈ మేరకు శనివారం టీఎస్ సెట్స్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్బాబు వివరాలను ప్రకటించారు. ఎల్ఎల్బీ (3 ఏళ్లు), ఎల్ఎల్బీ (5 ఏళ్లు), ఎల్ఎల్ఎంలలో 6,724 సీట్లు ఉండగా.. మొదటి దశలో 5,747 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మొదటి దశలో 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో 5,747 సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
Sun, 27 Nov 202202:15 AM IST
పురస్కారాలు…
హైదరాబాద్ లోని గోల్కొండ మెట్లబావి, నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటకు ప్రతిష్టాత్మకమైన యొనెస్కో పురస్కారానికి ఎంపికయ్యాయి.
Sun, 27 Nov 202201:50 AM IST
రెయిన్ అలర్ట్…
రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Sun, 27 Nov 202201:48 AM IST
టీంఇండియా బ్యాటింగ్…
హామిల్టన్: ఆదివారం హోమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ - భారత్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన కివీస్.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మూడో వన్టేల టోర్నీలో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్లో ఓటమి ఎదురైంది. ఇక నేటి మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్... బౌలింగ్ ఎంచుకుంది.
Sun, 27 Nov 202201:47 AM IST
పాదయాత్ర…?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తినలో ఉన్నారు. గత 3 రోజులుగా ఢిల్లీలోనే మక్కాం వేసిన ఆయన… పార్టీ అగ్రనేతలతో కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో భారీగా ప్రక్షాళన ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.