Exams Postponed : ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కొన్ని రోజులు విపరీతంగా వర్షాలు కురుస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు. మరోవైపు పరీక్షలను వాయిదా వేస్తున్నారు.
భారీ వర్షాలు, వరదలు కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయ పరిధీలో జరిగే అన్ని డిగ్రీ/B.Tech/B.Pharmacy/B.Ed/M.Ed పరిక్షలు నిరవధికంగా వాయిదా వేశారు. పరిక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో టైం టేబుల్ ప్రకటిస్తామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫేసర్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు తమ యూనివర్సిటీలో 14 నుంచి 16వ తేదీ వరకూ షెడ్యూల్ చేసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. రీ షెడ్యూల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. జులై 18 నుంచి జరగాల్సిన ఇతర పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొంది.
TS EAMCET 2022: ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. మరోవైపు ఎంసెట్ పరీక్షల గడువు దగ్గర పడింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జరగాల్సిన పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించగా... భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జిల్లాల నుంచి నగరాలకు రావాలంటే ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే పరీక్షల నిర్వహణపై అధికారులు కీలక ప్రకటన చేశారు,
ఇంతకుముందు ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో అధిక వర్షాల నేపథ్యంలో అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ ను వాయిదా వేయాలనే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి 14,15 తేదీల్లో జరిగే పరీక్షలను వాయిదా వేసింది.
రద్దయిన పరీక్షల నిర్వహణపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. లింబాద్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు.. జులై 13న జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో మూడు రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి కూడా త్వరలోనే తేదీలు రానున్నాయి.