Presidential election : నేడే రాష్ట్రపతి ఎన్నిక.. ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా
Presidential election : నేడు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ముర్ము- సిన్హాలో ఒకరిని తమ ఓటు హక్కు ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
Presidential election : 2022 రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో.. దేశవ్యాప్తంగా ఉన్న 4వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ద్రౌపది ముర్ము- యశ్వంత్ సిన్హాలలో ఒకరు భారతదేశ 15వ రాష్ట్రపతిగా అవతరించనున్నారు.
ఓటింగ్ ప్రక్రియ..
- సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్, వివిధ రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుంది.
- రహస్య బ్యాలెట్ పద్ధతిలోనే రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంతేకాకుండా.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయా పార్టీలు విప్ కూడా జారీ చేయలేవు. తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం అందరికి ఉంటుంది.
- రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రత్యేక పెన్ను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అందులో వైలెట్ ఇంకు ఉంటుంది. ఓటర్లు.. ఆ పెన్తోనే అభ్యర్థుల జాబితా ఉన్న బ్యాలెట్ పేపర్పై ఓటు వేయాల్సి ఉంటుంది.
- ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఎంపీలకు ఆకుపచ్చ రంగు పేపర్ అందుతుంది. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు పేపర్ లభిస్తుంది. ఇలా చేస్తే.. రిటర్నింగ్ ఆఫీసర్ పని సులభమవుతుందని ఈసీ భావిస్తోంది.
- పార్లమెంట్- శాసనసభ సభ్యులు, ఓటు 'వాల్యూ' ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఉత్తర్ప్రదేశ్లో ప్రతి ఎమ్మెల్యే ఓటు వాల్యూ.. 208. ఝార్ఖండ్- తమిళనాడులో అది 176.
ఎవరి బలం ఎంత?
Draupadi Murmu : ఈ దఫా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవడం ఖాయమే. కాగా.. యశ్వంత సిన్హాపై ఎంత మెజారిటీతో గెలుస్తారు? అన్నదే ఇక్కడ అసలు విషయం.
బీజేపీతో పాటు బీజేడీ, జేడీ-ఎస్, టీడీపీ, వైసీపీ, లోక్ జన్శక్తి పార్టీ, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, అన్నాడీఎంకే పార్టీల మద్దతు ద్రౌపది ముర్ముకే ఉంది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన కూడా.. ముర్ముకే మద్దతు ప్రకటించడం విశేషం.
మరోవైపు యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఎన్సీపీ, ఏఐఎంఐఎం, ఆర్జేడీ, ఆప్ మద్దతు ఉన్నా.. గెలుపునకు కావాల్సిన మెజారిటీ లేదు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది.
సంబంధిత కథనం