BF.7 variant India : యూపీలో కొవిడ్ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్!
BF.7 variant India : యూపీలో కొవిడ్ కలకలం రేగింది. చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది.
BF.7 variant India : చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ సోకిందన్న వార్త ఉత్తర్ ప్రదేశ్లో కలకలం సృష్టించింది. చైనాలో ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వార్తతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
40ఏళ్ల వ్యక్తి.. రెండు రోజుల క్రితమే చైనా నుంచి తిరిగొచ్చాడు. కొవిడ్ పరీక్షల్లో అతనికి పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే అతడిని హోం ఐసొలేషన్లో పెట్టినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం.. సంబంధిత వ్యక్తి సాంపిల్ను లక్నోకు పంపించనున్నట్టు వివరించారు.
Uttar Pradesh covid news : "ఈ వ్యక్తిని హోం ఐసొలేషన్లో పెట్టారు. అతని కుటుంబసభ్యులు, అతడిని కలిసిన వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ బృందాలకు ఆదేశాలు అందాయి," అని అరుణ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
చైనా నుంచి ఆగ్రాకు ఈ నెల 23న వచ్చాడు ఆ వ్యక్తి. ప్రైవేటు ల్యాబ్లో పరీక్షలు నిర్వహించుకోగా.. కొవిడ్ పాజిటివ్ అని తేలింది.
BF.7 variant cases in India : చైనాలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే కేంద్రం సైతం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, సిద్ధంగా ఉండాలని ఆరోగ్య వ్యవస్థకు సూచించింది. ఈ క్రమంలోనే మాక్ డ్రిల్స్ను సైతం వివిధ ఆసుపత్రులు చేపడుతున్నాయి.
కొవిడ్ను ఎదుర్కొనేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆగ్రా యంత్రాంగం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ టూంబ్లను సందర్శిస్తున్న విదేశీయుల సాంపిల్స్ను సేకరిస్తోంది. ఆగ్రా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లలో కూడా ఈ ప్రక్రియ చేపట్టింది. ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచనలు చేస్తోంది.
భయపడాల్సిన అవసరం లేదు..!
Covid cases in India : చైనాతో పోల్చుకుంటే.. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రభావం ఇండియాలో తక్కువగానే ఉంటుందని సీసీఎంబీ(సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలాజీ) డైరక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు. భారతీయుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే ఈ ఒమిక్రాన్ సబ్వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు.
బీఎఫ్.7 ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి అని పిలుపునిచ్చారు వినయ్ కే నందికూరి. ఒమిక్రాన్ వేరియంట్లకు రోగనిరోధక శక్తిని బలహీనపరిచే శక్తి ఉంటుందని హెచ్చరించారు.
India BF.7 variant news : "డెల్టాతో పోల్చుకుంటే బీఎఫ్.7 వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ పొందడమే ఇందుకు కారణం. మనపై ఇతర వైరస్ల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టే మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల బీఎఫ్.7తో భయపడాల్సిన పని లేదు. డెల్టాతో భయపడ్డాము. ఆ తర్వాత టీకాలు వచ్చాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. దానిపై పోరాటంగా బూస్టర్ డోస్లు వచ్చాయి. చైనాతో పోల్చుకుంటే మనం చాలా డిఫరెంట్. చైనాలో ఇప్పుడు జరుగుతున్నది ఇండియాలో జరగకపోవచ్చు," అని సీసీఎంబీ డైరక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం