Sri Lanka crisis : అధ్యక్షుడి ఇంట్లో రూ. కోట్ల సంపద.. నిరసనకారుల చేతికి!
Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభం వేళ అధ్యక్షుడి నివాసంలో రూ. కోట్ల సంపద నిరసనకారుల చేతికి చిక్కినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నగదును వారందరు భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్టు సమాచారం.
Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో నిరసనకారులు సృష్టించిన అలజడులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో మరో వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులకు.. రూ. కోట్ల సంపద కనిపించినట్టు స్థానిక మీడియా చెబుతోంది!
శ్రీలంక సంక్షోభం వేళ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో నిరనసకారులు కరెన్సీ నోట్లను లెక్కపెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. ఆ నగదును నిరసనకారులు తీసుకోలేదని, వాటిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్టు డైలీ మిర్రర్ అనే వార్తాపత్రిక వెల్లడించింది.
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలోకి శనివారం చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఆదివారం కూడా అక్కడే ఉండిపోయారు. రెండు రోజులుగా అధ్యక్షుడి పాలేస్లో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. పరుపులు మీద పడుకుని 'గొటబాయా.. నీ పరుపు చాలా సౌకర్యంగా ఉంది. థాంక్యూ' అని సామాజిక మాధ్యమాల్లోకి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరికొందరు స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఈత కొడుతున్నారు.
Gotabaya Rajapaksa house : కాగా.. శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడి చర్యలపై నిరసనకారులు మండిపడుతున్నారు.
"నేను ఇలాంటి పాలెస్ను నా జీవితంలో చూడలేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బయట మేము కష్టాలు పడుతుంటే.. వాళ్లు మాత్రం లగ్జరీలో జీవించారు. మా పిల్లలు, మనవళ్ల జీవితాలను నాశనం చేశారు," అని ఓ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
నిరసనకారుల ధాటికి భద్రతా సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలు సాధారణంగా లోపలికి వెళుతూ, బయటకు వస్తున్నారు. గొటబాయ రాజపక్స నివాసంలో ఆందోళనకారులు సృష్టించిన అలజడులపై దర్యాప్తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కానీ పరిస్థితులు చల్లబడేంత వరకు అది సాధ్యం కాకపోవచ్చు.
గొటబాయ ఎక్కడ..?
Sri Lanka president flees : మరోవైపు.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆచూకీపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. నిరసనకారుల ఆగ్రహాన్ని ముందే గుర్తించి, శుక్రవారమే ఆయన దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. కాగా.. ఈ బుధవారం రాజీనామా చేస్తానని పార్లమెంట్ స్పీకర్కు ఆయన సమాచారం అందించారు.
బుధవారం.. గొటబాయ రాజీనామా చేయకపోతే.. అధ్యక్షుడి నివాసానికి మళ్లీ వస్తావని, ఆయన మంచం మీద పడుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే శ్రీలంక సంక్షోభం మరింత ముదిరినట్టే.
రెండు రోజుల్లో శ్రీలంక ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు వైదొలిగారు. అవసరమైతే తాను కూడా రాజీనామా చేస్తానని ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు.
Sri Lanka crisis news : శ్రీలంక సంక్షోభంలో తాజా పరిణామాలను పరిశీలిస్తున్నాట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వెల్లడించింది. దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరపడితే.. ఐఎంఎఫ్ సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది.
శ్రీలంకకు సాయం చేసేందుకు ఇండియా కూడా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్