Karnataka swearing-in ceremony : విపక్ష నేతల ఐకమత్యం మధ్య సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం
Karnataka swearing-in ceremony : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విపక్ష నేతలు భారీగా తరలివచ్చారు.
Karnataka swearing-in ceremony : 2023 కర్ణాటక ఎన్నికల ముగింపు ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది. దేశంలోని విపక్షాలు తమ ఐకమత్యాన్ని ప్రదర్శించిన వేదికలో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ వేడుకలో డీకే శివకుమార్ ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలాది మంది ప్రజల కోలాహలంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది.
సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేసిన అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు డీకే శివకుమార్. అనంతరం పలువురు ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు కర్ణాటక గవర్నర్ థవార్ చాంద్ గహ్లోత్.
Siddaramiah swear in ceremony : ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్తో పాటు పార్టీలోని కీలక నేతలు హాజరయ్యారు. అదే సమయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, రాజకీయ నేత కమల్ హాసన్, ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాలు హాజరయ్యారు.
2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ఐకమత్యంతో బీజేపీని ఓడించాలని భావిస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో కర్ణాటక వేదికను ఉపయోగించుకుని తమ ఐకమత్యాన్ని చాటిచెప్పాయి.
డీకే వర్సెస్ సిద్ధరామయ్య..
Karnataka assembly elections : 224 సీట్లు కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. 13న ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 సీట్లను వెనకేసుకుని బీజేపీ, జేడీఎస్లకు గట్టి షాక్ ఇచ్చింది.
ఆ తర్వాత కాంగ్రెస్లో 'రాజకీయాలు' మొదలయ్యాయి. సీఎం పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు పోటీపడ్డారు. వాస్తవానికి ఈ ఇద్దరు.. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినవారే. అందుకే వీరిలో ఎవరికి సీఎం పదవిని కట్టబెట్టాలి? అన్న అంశం పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకే.. గత శనివారం ఫలితాలు వెలువడగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంత సమయం పట్టింది.
Karnataka Congress latest news : ఇక్కడే సోనియా గాంధీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్కు ఆమె నచ్చజెప్పినట్టు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడి బుజ్జగించినట్టు సమచారం. చివరికి.. సీఎం పీఠం సిద్ధరామయ్యను వరించింది. శనివారం ఆయన ప్రమాణం చేశారు.
ఇక ప్రమాణస్వీకార మహోత్సవంలో.. డీకే శివకుమార్, సిద్ధరామయ్య చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. తమ మధ్య విభేదాలు లేవని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్