Karnataka CM Suspense: కర్ణాటక సీఎంపై నేడే ప్రకటన! రాహుల్ గాంధీతో భేటీ కానున్న సిద్ధరామయ్య, శివ కుమార్
Karnataka CM Suspense: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ నేడు వీడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేడు భేటీ కానున్నారు.
Karnataka CM Suspense: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు అవుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూతేల్చకపోవటంతో టెన్షన్ నెలకొంది. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ నేడు (మే 17) నిర్ణయం తీసుకుంటుందని అంచనాలు ఉన్నాయి. సీనియర్ లీడర్లు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి వారు కలిసే అవకాశం ఉంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంట లేకపోతే సాయంత్రంలోగా కర్ణాటక సీఎంపై కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
Karnataka CM Suspense: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (224 స్థానాలు) ఫలితాలు ఈనెల 13న రాగా.. 135 సీట్లను సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. అయితే, సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతుంటంతో అధిష్టానం తీవ్ర సమాలోచనలు చేస్తోంది. పలు ప్రతిపాదనలను ఆలోచిస్తోంది. సోమవారం నుంచి సిద్ధరామయ్య ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్.. మంగళవారం హస్తినకు వెళ్లారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరితో మాట్లాడారు.
Karnataka CM Suspense: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వైపు రాహుల్ గాంధీ మొగ్గుచూపుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు డీకే శివకుమార్ కూడా సీఎం పదవి కోసం పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని ఆ ఇద్దరి ముందు కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదన పెట్టినట్టు సమచారం. అయితే ఇందుకు డీకే శివకుమార్ విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే కేబినెట్లోనూ స్థానం వద్దని ఆయన చెప్పినట్టు సమాచారం.
కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని గెలిపించి ట్రబుల్ షూటర్గా డీకే శివకుమార్ నిలిచారు. మరోవైపు సిద్ధరామయ్యకు ప్రజాదరణ అధికంగా ఉంది. గతంలో సీఎంగా సమర్థవంతంగా పనిచేశారని చాలా మంది అభిప్రాయం. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీని చీల్చబోనని, అలాంటి ఆలోచనే లేదని శివకుమార్ స్పష్టం చేశారు.