5G spectrum auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. ఎవరిది పైచేయి?
5G spectrum auction begins: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. 4జీ కంటే 10 రెట్ల వేగం అందించనున్న 5జీ ఎవరి వశం కానుంది?
5G spectrum auction begins: ఇండియాలో అతి పెద్ద స్పెక్ట్రమ్ వేలానికి తెర లేచింది. టెలిఫోన్, ఇంటర్నెట్ డేటా సిగ్నల్స్ అందించే ఈ స్పెక్ట్రమ్ వేలంలో రూ. 4.3 లక్షల కోట్ల 72 గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల 5జీ ఎయిర్ వేవ్స్ను అమ్మకానికి పెట్టారు.
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్కు చెందిన భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ 5జీ వేలంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ప్రస్తుతం 4జీ ద్వారా అందుతున్న వేగం కంటే పది రెట్ల వేగంతో 5జీ స్పీడ్ ఉంటుంది. అల్ట్రా హైస్పీడ్తో పాటు, అంతరాయం లేని కనెక్టివిటీ కలిగి ఉంటుంది. కోట్లాది డివైజెస్ ద్వారా రియల్ డేటా షేర్ చేసుకోవచ్చు.
అల్ట్రా లో లేటెన్సీ (ఒక చోట నుంచి ఒక చోటికి డేటా అతి తక్కువ సమయంలో చేరుకోవడం) కనెక్షన్లకు శక్తినివ్వడమే కాకుండా, హై క్వాలిటీ ఫుల్ లెంగ్త్ వీడియో లేదా మూవీని మొబైల్ డివైజ్ నుంచి కొద్ది సెకెండ్లలోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ జనరేషన్ లేదా 5జీ ద్వారా ఈ-హెల్త్, కనెక్టెడ్ వెహికిల్స్, ఇమ్మెర్సివ్ అగ్మెంటెడ్ రియాలిటీ, మెటావర్స్ ఎక్స్పీరియన్స్, లైఫ్ సేవింగ్, అడ్వాన్స్డ్ మొబైల్ క్లౌడ్ గేమింగ్ తదితర పరిష్కారాలు సులువుగా లభ్యమవుతాయి.
ఈ 5 జీ స్పెక్ట్రమ్లో తక్కువ (600 ఎంహెచ్, 700 ఎంహెచ్జడ్, 800 ఎంహెచ్జడ్, 900 ఎంహెచ్జడ్, 1800 ఎంహెచ్జడ్, 2100 ఎంహెచ్జడ్) మధ్యస్థ (3300 ఎంహెచ్జడ్), ఎక్కువ (26 జీహెచ్జడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్కు వేలం జరపనున్నారు.
బిడ్డింగ్ 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. వేలం ప్రక్రియ మిగిలి ఉంటే రేపు కూడా కొనసాగుతుంది.
రేడియోవేవ్స్ వాస్తవిక డిమాండ్, బిడ్లర్ల వ్యూహం తదితర అంశాలను బట్టి స్పెక్ట్రమ్ వేలం సమయం ఆధారపడి ఉంటుంది. అయితే ఇండస్ట్రీ ఏకాభిప్రాయం ప్రకారం ఇది రెండు రోజుల పాటు సాగే అవకాశం ఉంది.