శునకం మొరిగిందని కర్రతో వీరంగం.. విచక్షణారహితంగా ముగ్గురిపై దాడి
Delhi dog news : తనని చూసి శునకం మొరిగిందని కోపం తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి. విచక్షణారహితంగా ఆ శునకంపై దాడి చేశాడు. అడ్డొచ్చిన మరో ముగ్గురిని కూడా కొట్టాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
Delhi dog news : ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగింటిలో పెంపుడు శునకం తనపై మొరిగిందన్న కారణంతో వీరంగం సృష్టించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో శునకంతో సహా ముగ్గురిని విచక్షణారహితంగా కొట్టాడు.
ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. నిందితుడు ధరంవీర్ దహియ- రక్షిత్లు పక్కపక్క ఇళ్లల్లో నివాసముంటున్నారు. కాగా.. సోమవారం ఉదయం ఇంటి బయటకు వెళ్లాడు ధరంవీర్. అప్పుడే అతడిని చూసి రక్షిత్ పెంపుడు శునకం అరిచింది. చిరాకు వల్ల కోపం తెచ్చుకున్న ధరంవీర్.. ఆ శునకంపై దాడి చేశాడు. ఆ కుక్క తోక పట్టుకుని పక్కకు విసిరేశాడు. ఈ క్రమంలోనే ఆ శునకరం అతడిని కరిచినట్టు తెలుస్తోంది.
తన శునకాన్ని కొట్టడం చూసిన రక్షిత్.. ధరంవీర్తో గొడవకు దిగాడు. అప్పుడే.. పక్కనే ఉన్న కర్ర తీసుకుని రక్షిత్పై దాడి చేశాడు ధరంవీర్. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రక్షిత్ కుటుంబంలోని ఓ మహిళను కూడా దారుణంగా కొట్టాడు. వద్దని చెప్పిన పొరుగింటి వ్యక్తిని కూడా కొట్టాడు.
ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ధరంవీర్ కొట్టిన కర్ర దెబ్బకు ఆ శునకం ఒక్కసారిగా కిందపడిపోయింది.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాయపడిన శునకాన్ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. తల మీద బలమైన దెబ్బ తగలడంతో ఆ శునకం రక్తం గడ్డకట్టిందని, చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
కాగా.. గాయపడిన ముగ్గురిని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ధరంవీర్ని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుక్క కరవడంతో అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్