Prabhas in Mogalthuru: ప్రభాస్ నిజంగా రాజే.. లక్ష మందికి విందు భోజనాలు
Prabhas in Mogalthuru: ప్రభాస్ నిజంగా రాజే అని అనకుండా ఉండలేరు. కృష్ణంరాజు స్మారక సభ సందర్భంగా మొగల్తూరులో ఏకంగా లక్ష మందికి విందు భోజనాలు ఏర్పాటు చేయడం విశేషం.
Prabhas in Mogalthuru: సిల్వర్ స్క్రీన్పై రెబల్ స్టార్గా పేరుగాంచినా.. బయట మాత్రం ఎప్పుడూ ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించేవారు కృష్ణంరాజు. ఇప్పుడు సినిమాల్లోనే కాదు.. బయట కూడా అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్. ఎప్పుడూ తన అభిమానులను ఎంతో బాగా చూసుకోవడం వీళ్ల కుటుంబానికి అలవాటు.
కృష్ణంరాజు మరణించిన సమయంలో అంత బాధలోనూ తన ఇంటికి వచ్చిన అభిమానులందరికీ భోజనాలు చేసి వెళ్లండంటూ ప్రభాస్, అతని కుటుంబ సభ్యులు కోరిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక ఇప్పుడు కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో గురువారం (సెప్టెంబర్ 29) ఏర్పాటు చేసిన సంస్మరణ సభ కోసం వచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ కుటుంబం విందు భోజనాలు ఏర్పాటు చేసింది.
సుమారు లక్ష మంది వరకూ తరలి వచ్చినా.. అందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టడం విశేషం. చాలా రోజుల తర్వాత ప్రభాస్.. మొగల్తూరుకు రావడంతో అతన్ని చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అందరికీ తన ఇంటి నుంచే అభివాదం చేశాడు ప్రభాస్. ఈ సందర్భంగా తమ దగ్గరికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ఉప్పలపాటి కుటుంబం భోజనాలు ఏర్పాటు చేసింది.
ఏదో భోజనం పెట్టామంటే పెట్టామన్నట్లు కాకుండా.. నోరూరించే రకరకాల కూరలు వడ్డించారు. అక్కడ ఏర్పాటు చేసిన మెనూ చూస్తే దిమ్మదిరిగిపోతుంది. కృష్ణంరాజు కోసం వచ్చిన ఆ అభిమానులందరికీ భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు.
సుమారు లక్ష మంది అభిమానుల కోసం 6 టన్నుల మటన్ కూర, 6 టన్నుల మటన్ బిర్యానీ, ఒక టన్ను గోంగూర రొయ్యలు, ఒక టన్ను రొయ్యలు, ఒక టన్ను చేపలు, ఆరు టన్నుల చికెన్ కూర, నాలుగు టన్నుల చికెన్ ఫ్రై, 4 టన్నుల ఫిష్ ఫ్రై, రెండు టన్నుల ఫిష్ కర్రీతోపాటు మొత్తం 22 రకాల నాన్వెజ్ ఐటెమ్స్ ఏర్పాటు చేయడం విశేషం.
ఇక తమ ఇంటికి వచ్చిన ప్రతి అభిమానీ కచ్చితంగా కడుపు నిండా తిని వెళ్లేలా ప్రభాస్ కుటుంబ సభ్యులు చూసుకున్నారు. ప్రతి ఒక్కరినీ భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరారు. ప్రభాస్ కుటుంబ ఆతిథ్యం చూసి వీళ్లు నిజంగా రాజులే అని అనుకోకుండా ఉండే అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు.