MLA Danam Nagender : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్-brs khairatabad mla danam nagender joined congress ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Brs Khairatabad Mla Danam Nagender Joined Congress

MLA Danam Nagender : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 01:45 PM IST

MLA Danam Nagender joined Congress: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్… కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్
కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్

MLA Danam Nagender joined Congress: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్(MLA Danam Nagender)… కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే కాకుండా… చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు.

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. గతంలో ఆ పార్టీ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన… మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన… ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన దానం నాగేందర్….. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలుపు….

బీఆర్ఎస్ పార్టీలో చేరిన దానం నాగేందర్(Khairatabad BRS MLA Danam Nagender)… 2018 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం… మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22,010 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా… బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.

ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అయితే కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు(Loksabha Elections 2024) సమీపిస్తున్న వేళ…. పార్టీ విజయావకశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు పావులు కదిపే పనిలో పడింది. ఇందులో భాగంగా… కీలక నేతలను పార్టీలోకి రప్పిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అధికారికంగా చేరలేదు. మర్యాదపూర్వకంగా మాత్రం… పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవగా… పార్టీ మారుతారనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ వార్తలను కలిసిన ఎమ్మెల్యేలు ఖండించారు. మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని చెప్పుకొచ్చారు. అయితే దానం నుంచి కూడా ఇదే తరహా ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ…. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాజీనామా.. ఆ వెంటనే కాంగ్రెస్ లోకి

చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(MP Ranjith Reddy) కూడా పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ ఆదివారం లేఖను విడుదల చేశారు. రాజీనామా ప్రకటించిన కాసేపట్లోనే… ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మరోసారి చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.

2014లో బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల వేళ ఆయన పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున రంజిత్ రెడ్డి బలిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై 14,317 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా రంజిత్ రెడ్డినే అభ్యర్థిగా దించాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. టికెట్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ తరపున బరిలో ఉండేందుకు రంజిత్ రెడ్డి ఆసక్తిని కనబర్చలేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడారని తెలుస్తోంది.

WhatsApp channel