Smriti Mandhana: అప్పుడు కోహ్లి...ఇప్పుడు స్మృతి మంథన - సేమ్ టూ సేమ్
Smriti Mandhana: టీమిండియా ఉమెన్స్ స్టార్ ప్లేయర్ స్మృతి మంథన విరాట్ కోహ్లిని ఫాలో అవుతోంది. ఐపీఎల్లో కోహ్లి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో స్మృతి మంథన ఆటతీరును కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
Smriti Mandhana: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంథన సెకండ్ సీజన్లో మాత్రం చెలరేగుతోంది. ఈ సీజన్లో మూడు మ్యాచుల్లోనే 43 యావరేజ్తో 130 పరుగులు చేసింది.
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్మృతి మంథన ఆకాశమే హద్దుగా చెలరేగింది. 43 బాల్స్లోనే పది ఫోర్లు, మూడు సిక్సర్లతో 74 రన్స్ చేసింది. స్మృతి మంథన ఒంటరిపోరాటం చేసిన మిగిలిన ప్లేయర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఈ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి పాలైంది.
దంచి కొట్టిన ఢిల్లీ...
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇరవై ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా హిట్టర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో ఢిల్లీకి చక్కటి ఆరంభాన్ని అందించింది. 31 బాల్స్లోనే నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో షెఫాలీ వర్మ సరిగ్గా యాభై పరుగులు చేసి ఔటయింది.
షెఫాలీకి అలైస్ క్యాప్సీ చక్కటి సహకారం అందించింది. 33 బాల్స్లో 46 రన్స్ చేసింది. చివరలో కాప్ (16 బాల్స్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 32 పరుగులు), జానస్సెన్ (16 బాల్స్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో 36 రన్స్ ) మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేధనలో...
195 పరుగుల టార్గెట్ను రాయల్ ఛాలెంజర్స్ ధాటినే ఆరంభించింది.స్మృతి మంథన ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో బెంగళూరు స్కోరు పరుగులు పెట్టింది. ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు దాటింది. కానీ మిగిలిన బ్యాట్స్మెన్స్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆమె పోరాటం వృథాగానే మారింది. 43 బాల్స్లో 74 పరుగులు చేసింది స్మృతి మంథన ఔటవ్వడంతో బెంగళూరు కథ ముగిసింది.
స్మృతి మంథన తర్వాత మేఘన 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇరవై ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసింది. 25 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది.
అచ్చం విరాట్ లాగే...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో స్మృతి మంథన ఆట అచ్చం ఐపీఎల్లో కోహ్లిని తలపిస్తుంది. స్మృతి మంథన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్లో విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయింది. సెకండ్ సీజన్లో మూడో మ్యాచ్ ద్వారా ఈ లీగ్లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్పైన ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసింది.
కోహ్లి కూడా ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అంతే కాకుండా సెకండ్ సీజన్ మూడో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పైనే ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. అక్కడి నుంచి తన జోరును కొనసాగించాడు. కోహ్లిని స్మృతి మంథన ఫాలో అవుతోండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరిని ఆటతీరును కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.