Road accident at Chittoor: బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి
Chittoor district Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Road accident at Chinnasettipalle: కారు - లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలో జరిగింది. గుడుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఫలితంగా కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతులను వికాస్, కల్యాణ్, ప్రవీణ్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.మృతి చెందిన విద్యార్థులు కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ విద్యార్థులు అని తేలింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ జరుపుకుని అనంతరం తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సులు దగ్ధం….
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా గుంపుల గ్రామ శివారులో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం వేకువజామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో సాంకేతికలోపం తలెత్తినట్లు తెలుస్తోంది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు. అనంతరం సూర్యాపేట నుంచి ఏపీఎస్ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. తీగల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈలోపు సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్ధం వచ్చి భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలే మరో బస్సుకూ వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు.