Murder In Chittoor : భార్యపై అనుమానం.. అత్తను చంపి అల్లుడు పరార్
Chittoor Crime News : ఓ వ్యక్తిని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకుంది ఆ కుటుంబం. కన్నబిడ్డలా చూసుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ భార్య మీద అనుమానంతో అత్తనే చంపి వెళ్లాడు అల్లుడు.
ఇంటికి అల్లుడిని తెచ్చుకుంటే.. కన్న కొడుకులా చూసుకుంటాడు అనుకుంది ఆమె. కన్నకూతురు కూడా కళ్ల ముందే ఉంటుంది కదా అనుకుంది. కానీ ఆమె అనుకున్నది వేరు.. జరిగింది వేరు. కొడుకులా తమను దగ్గరకు తీసుకుంటాడు అనుకున్న అల్లుడు.. హత్య చేసి పరారీ అయ్యాడు. ఈ ఘటన చిత్తూరు(Chittoor) జిల్లా నగరి మండలం ఇల్లత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
ట్రెండింగ్ వార్తలు
ఇల్లత్తూరు గ్రామానికి చెందిన మణియమ్మ(42) తన కుమార్తె నిరోషకు పెళ్లి చేయాలనుకుంది. సంబంధాలు వెతికింది. తమిళనాడు(Tamil Nadu)లోని తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్ తో పెళ్లి కుదిరింది. నిరోష, కార్తీక్ వివాహం ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. అయితే కార్తీక్ ఇల్లరికపు అల్లుడిగా అత్తగారింట్లోనే ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం తాపీ మేస్త్రీ పనికి వెళ్తున్నాడు.
నిరోష, కార్తీక్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిరోష కూడా పనికి వెళ్తుంది. శ్రీపెరంబదూర్లోని ఓ ప్రైవేటు కంపెనీ(Private Company)లో వర్క్ చేస్తుంది. కొన్ని రోజులుగా కార్తీక్ భార్య మీద అనుమాన పడుతున్నాడు. తన భార్యకు ఎవరితోనే వివాహేతర సంబంధం(Extra Marital Affair) ఉందని గొడవలు పడేవాడు. ఇటీవలి కాలంలో ఈ గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. శుక్రవారం రాత్రి సైతం.. ఇలానే జరిగింది. కార్తీక్, నిరోష మధ్య మాటమాట పెరిగింది.
ఈ విషయం మణియమ్మ గమనించింది. కొడుకులా చూసుకుంటాడు అనుకున్న అల్లుడు ఇలా గొడవలు చేస్తూ ఉండటంపై విసిగిపోయింది. అప్పటికే కార్తీక్, నిరోష గొడవ పెద్దదయింది. మణియమ్మ వెళ్లి అడ్డుకుంది. తనను అడ్డుకోవడంపై కార్తీక్ తీవ్రంగా స్పందించాడు. చేతికి దొరికిన ఇనుప(Iron) కమ్మీతో మణియమ్మను పొడిచాడు. దీంతో ఆమె అక్కడే మృతిచెందింది. వెంటనే కార్తీక్ అక్కడ నుంచి పరారీ అయ్యాడు.
ఈ విషయం పోలీసు(Police)లకు తెలిసి ఘటన స్థలానికి వచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుని.. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నగరి ఏరియా హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కార్తీక్ కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు.