Lokesh Yuvagalam: ఏపీలో మైనింగ్ రంగాన్ని ప్రక్షాళన చేస్తామన్న నారా లోకేష్-nara lokesh announced that he will clean up the mining sector in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Announced That He Will Clean Up The Mining Sector In Ap

Lokesh Yuvagalam: ఏపీలో మైనింగ్ రంగాన్ని ప్రక్షాళన చేస్తామన్న నారా లోకేష్

HT Telugu Desk HT Telugu
May 22, 2023 07:11 AM IST

Lokesh Yuvagalam: ఏపిలో జగన్ మైనింగ్ కార్పొరేషన్ తప్ప మరెవరూ మైనింగ్ చేయకూడదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గం అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ యజమానులు, కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.

గజమాలతో నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు
గజమాలతో నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు

Lokesh Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 106వ రోజు బనగానపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు జనం భారీ ఎత్తున తరలి వస్తుండటంతో దారిపొడవున జనసంద్రాన్ని తలపించింది. ఆముదాలమిట్ట శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమన పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు.

ట్రెండింగ్ వార్తలు

పాదయాత్ర కోవెలకుంట్లకు చేరుకోగానే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయి, ప్రజలు యువనేతను చూసేందుకు భవనాలపైకి ఎక్కారు. మహిళలు హారతులు పడుతూ యువనేతను స్వాగతించారు. ఈ క్రమంలో నారా లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఫోటోలు దిగారు.

తనని కలవడానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం ఆముదాల మిట్ట క్యాంప్ సైట్ లో గ్రానైట్ పరిశ్రమదారులు, కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. దారిపొడవునా కుందూనది పోరాట సమితి నాయకులు, ఆర్యవైశ్యులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.

ఆముదాలమెట్ల, సౌదరదిన్నె, కోవెలకుంట్ల, భీమునిపాడు, కంపమల్ల మీదుగా సాగిన యువగళం పాదయాత్ర దొర్నిపాడు శివార్లలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకకవర్గంలోకి ప్రవేశించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఎదురేగి యువనేతను స్వాగతించారు. 106వరోజు యువనేత లోకేష్ 17 కి.మీ.మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1363.6 కి.మీ. మేర పూర్తయింది.

జేఎంసి తప్ప ఎవరిని మైనింగ్ చేయినివ్వట్లేదన్న లోకేష్..

ఏపిలో జగన్ మైనింగ్ కార్పొరేషన్ తప్ప మరెవరూ మైనింగ్ చేయకూడదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గం అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ యజమానులు, కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి నాయకులు లాక్కున్న గనులన్నింటినీ స్వాధీనంచేసుకొని, అక్రమంగా దోచేసిన డబ్బంతా కక్కిస్తామని ప్రకటించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మెరుగైన మైనింగ్ పాలసీ తీసుకొచ్చి, పన్నుల భారం తగ్గిస్తామన్నారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేసుకునే వాతావరణం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

మైనింగ్ పరిశ్రమను ఇండస్ట్రీగా గుర్తించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన చెత్త జిఓలు రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఫ్యాక్టరీలు ఉన్నాయని, అనుబంధ కంపెనీలు అనేకం ఉన్నాయని దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని వివరించారు. మైనింగ్ లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని, వారికి మెరుగైన జీతాలు, ఆరోగ్య భీమా, ఈఎస్ఐ సదుపాయం, ప్రమాద భీమా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వ్యవస్థలను ధ్వంసం చేసిన జగన్

జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశాడు. జగన్ పాలనలో మైనింగ్ యజమానులు, కార్మికులు నరకం అనుభవిస్తున్నారని, వారు పడుతున్న ఇబ్బందులు అన్ని తెలుసని లోకేష్ వివరించారు. ప్రజలకి బాదుడు, మైనింగ్ కంపెనీలకు వీర బాదుడు తప్పట్లేదన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం వదలలేదని విమర్శించారు. కరోనా సమయంలో కూడా దోపిడీ చేశారని విమర్శించారు.

IPL_Entry_Point