AP New CS : ఏపీ కొత్త సీఎస్గా కెఎస్ జవహర్.. ప్రభుత్వం ఉత్తర్వులు
AP IAS Officers Transfer : ఏపీ కొత్త సీఎస్ గా కెఎస్ జవహర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికి.. భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
ఏపీలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు(IAS Transfers) జరిగాయి. సీఎంఓ స్పెషల్ సీఎస్గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్ జవహర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత కాసేపటికే.. ఐఏఎస్ల బదిలీలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎంఓ స్పెషల్ సీఎస్గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్గా మధుసూదన రెడ్డిలను నియమించింది ప్రభుత్వం. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ ను బదిలీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. సమీర్ శర్మ(Sameer Sharma) పదవీ కాలం ఇప్పటికే ముగిసినా ఆర్నెల్లపాటు పొడిగించారు. దీంతో కొత్త సీఎస్గా జవహర్ రెడ్డిని నియామకానికి ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి(Jawahar Reddy) డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
2024 జూన్ వరకు జవహర్ రెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఏడాదిన్నర పాటు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా పనిచేయనున్నారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి(IAS Officer). ఏపీ క్యాడర్లో ఆయనకంటే సీనియర్లైన 1987 బ్యాచ్ నీరబ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్ పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ కరికాల్ వలవన్లు చీఫ్ సెక్రటరీ పోస్టును ఆశించినా సీఎం జవహర్ రెడ్డికే ప్రాధాన్యతనిచ్చారు.
రాష్ట్రంలో వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జవహర్ రెడ్డికి ప్రభుత్వం ప్రాధాన్యత లభిస్తోంది. ఆయన స్వయంగా కోరడంతో మొదట్లో టీటీడీ ఈవో(TTD EO) బాధ్యతలు అప్పగించారు. ఆ పోస్టులో ఉండగానే సీఎంఓ(CMO)లో కార్యదర్శిగా నియమించారు. కొన్ని నెలల పాటు రెండు పోస్టుల్లోను కొనసాగారు. కోవిడ్(Covid) సమయంలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల్ని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జవహర్ రెడ్డి సారథ్యంలోనే సీఎంఓ కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మీని కూడా సీఎస్ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు జవహర్ రెడ్డికే ఆ పదవి వరించింది. డిసెంబర్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.