Kannababu On Chandrababu : చంద్రబాబు పెద్ద సైకో, లోకేశ్ పిల్ల సైకో- రైతు వేషంలో రాబందు బాబు : మాజీ మంత్రి కన్నబాబు
Kannababu On Chandrababu : సీఎం జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు ఫ్రస్టేషన్ వచ్చి ఏంమాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు రైతు బాంధువుడిలా కొత్త వేషం వేసుకుని ఊళ్లోకి దిగిపోయారని ఎద్దేవా చేశారు.
Kannababu On Chandrababu : రైతు వేషం వేసిన రాబందు చంద్రబాబు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు... చంద్రబాబుకు రైతులంటే అమరావతి రైతులే అని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. రైతులు నష్టపోతే సీఎం జగన్ పట్టించుకోవడంలేదని చంద్రబాబు విమర్శలు చేస్తు్న్నారు. చంద్రబాబు విమర్శలకు మాజీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రతీదాన్ని రాజకీయం చేస్తు్న్నారన్నారు. ఆయనదంతా ఈట్ పాలిటిక్స్...డ్రింక్ పాలిటిక్స్ విధానమన్నారు. ధాన్యం కొనుగోలును పారదర్శకంగా మార్చింది జగన్ అన్నారు. చంద్రబాబు మిల్లర్లకు దోచిపెట్టేవారని, నొక్కుడు, బొక్కుడూ చూసే ప్రజలు బాబును ఇంటికి పంపారన్నారు. చంద్రబాబు నొక్కుడుపై కమిటీ వేస్తే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న ఘనుడు అని విమర్శించారు.
టీడీపీ ఓ డ్రామా కంపెనీ
" చంద్రబాబు టీడీపీని ఒక డ్రామా కంపెనీగా నడుపుతున్నారు. నువ్వొక పెద్ద సైకో...నీ కొడుకో పిల్ల సైకో అని మేమూ అనగలం. మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. పెత్తందార్ల వైపు టీడీపీ..పేదలవైపు వైఎస్సార్సీపీ పనిచేస్తున్నాయి. రైతు బాంధవుడిలా చంద్రబాబు కొత్త వేషం వేశారు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం అనుకూలించడం లేదు. గోదావరి డెల్టాలో ఒక ఎకరా కూడా ఎండిపోకూదని మార్చిలోనే సీఎం జగన్ సీలేరు నుంచి సాగునీరు అందించారు. ఈ క్రమంలో రెండో పంట బాగా పండింది. మంచి దిగుబడులు కూడా వస్తున్నాయనుకున్న తరుణంలో వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రకృతిని కంట్రోల్ చేయడం మానవ మాతృలకు సాధ్యం కాదు. మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా రైతు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా అధికార బృందాలను ఏర్పాటు చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అందరూ ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు." -కన్నబాబు
రైతు బాంధువుడిలా కొత్త వేషం
ఈ లోపే చంద్రబాబు రైతు బాంధువుడిలా కొత్త వేషం వేసుకుని ఊళ్లోకి దిగిపోయారని కన్నబాబు విమర్శించారు. ఈ రాజకీయ రాబందుకు రైతులు పాడైపోతున్నారంటే పండుగ చేసుకున్నట్లుందన్నారు. పొలాల్లో తిరిగేస్తున్నానంటూ టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని జగన్ పై శాపనార్ధాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వాడే భాషను చూస్తే అతను ఇంతకంటే దిగజారిపోడానికి మెట్లు ఏమీ లేవని అనిపిస్తుందన్నారు. చంద్రబాబు టీడీపీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక డ్రామా కంపెనీలా నడుపుతున్నారని ఆక్షేపించారు. జాతరలు వస్తే డాన్స్ కంపెనీలు దిగిపోయినట్లు దిగిపోయి పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నారన్నారు. సీఎంపై చంద్రబాబు వాడే భాష దిగజారుడుతనంగా మారిందన్నారు. ముఖ్యమంత్రిగా చాలా మంది చేశారు కానీ ఇంత దిగజారుడు భాష వాడిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అన్నారు.
జగన్ దెబ్బకి చంద్రబాబుకు ఫ్రస్టేషన్
చంద్రబాబుకు తాను ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏం ఉచ్చరిస్తున్నారో తెలియడం లేదు...పూర్తి ఫ్రస్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఆయన ఫ్రస్టేషన్కి ఇద్దరే ఇద్దరు కారణం..ఒకరు రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్రెడ్డి రెండోది తన భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్న కొడుకు లోకేశ్ అన్నారు. జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు తేరుకోలేకపోతున్నారన్నారు. ఎన్ని డ్రామాలు వేసినా గతంలో తమరేం పీకారని ప్రజలు అడుగుతున్నారని కన్నబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు తాను 45 ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని, అతనికి రాజకీయాలంటే ఒక ఇండస్ట్రీ మాత్రమే అన్నారు. చంద్రబాబుకు రైతులంటే అమరావతి రైతులే అని కన్నబాబు విమర్శించారు. చివరికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 474 ఆత్మహత్యలని రైతు ఆత్మహత్యలు కాదని క్లోజ్ చేశారన్నారు.