Janasena Pawankalyan :కాపుల సారథ్యంలో అధికారమే లక్ష్యమన్న పవన్..
Janasena Pawankalyan కాపులు పెద్దన్న పాత్ర పోషించి దళితులు, బిసిలను కలుపుకుని వెళ్తేనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, లేనిపక్షంలో ఎప్పటికీ రాజకీయ సాధికారత సాధ్యం రాదని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపుల్లో ఐక్యత రానంత వరకు రాజకీయ సాధికారత సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
Janasena Pawankalyan ఏ పార్టీ జెండా... అజెండాల కోసం జనసేన పని చేయదని, తమకు నచ్చకపోతే నచ్చలేదని నిర్మోహమాటంగా చెబుతామని, కాపులు... బీసీలు, దళితులకు కలుపుకొని వెళితేనే రాజ్యాధికారం సిద్దిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లనివ్వనని పవన్ చెప్పారు. వాస్తవిక ధోరణితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను తప్ప... అవమాన పడి, గింజుకొని ఎవరితోనో ఎందుకుంటానన్నారు.
ఈ మధ్య వెయ్యి కోట్లు... వెయ్యి కోట్లు అని మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని... డబ్బుతో ఎవరూ రాజకీయ పార్టీని నడపలేరని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పార్టీ భావనాబలంతో నడుస్తుంది తప్ప డబ్బుతో కాదన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించి దళితులు, బీసీలను కలుకొని వెళ్లగలిగితే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, లేని పక్షంలో ఎన్నటికీ రాజకీయ సాధికారిత సాధ్యం కాదన్నారు.
“సంఖ్యా బలం ఎక్కువ ఉండి కూడా రాజ్యాధికారం చేజిక్కుంచుకోలేని కులాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమూహాలు చాలా కీలకమైనవని, ఇప్పటికీ మాకు రిజర్వేషన్ ఇవ్వండి, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వండి అని చేయి చాచడం బాధాకరమని, కొంతమంది నాయకులు కులాలను వాడుకొని పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప... కులానికి ఉపయోగం పడటం లేదన్నారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారంలోకి రాగానే బీసీలు, దళితులను ఎదగనివ్వరనే విష ప్రచారం బయట జరుగుతోందని, దానిని బలంగా తిప్పికొట్టాలన్నారు. కాపులకు సాధికారిత రావాలంటే ఒక తరం నాయకులు త్యాగానికి సిద్ధం కావాలన్నారు. వ్యక్తిగత పదవులను త్యాగం చేసి రాజకీయ సాధికారిత కోసం ప్రయత్నం చేస్తే మళ్లీ ఎప్పుడూ కూడా దేహీ అనే పరిస్థితి రాదన్నారు. ముఖ్యంగా కాపుల్లో ఐక్యత రానంత వరకూ రాజకీయ సాధికారిత సాధ్యం కాదన్నారు.
కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడని పవన్ కళ్యాణ్ చెప్పారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయగలిగితే అత్యుత్తమమని లేనిపక్షంలో డబ్బులు తీసుకొని జనసేనకు ఓటు వేయాలన్నారు. వైసీపీ మాత్రం ఓటు వేయొద్దని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కాపులు అవసరం లేదని చెప్పిన వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించారని ఆ మనిషి మిమ్మల్ని కాదని చీ కొట్టినా మీరు మాత్రం భుజాల మీదకు ఎక్కించుకున్నారన్నారు.
పేటిఎం ప్రచారాలు నమ్మొద్దు…
కాపులు, బీసీలు పవన్ కళ్యాణ్పై జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మ వద్దని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. గత ఎన్నికల్లోనే జరిగిన కుట్రపూరిత ప్రచారాన్ని నమ్మి.. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని విశ్వసించ లేదని ఇప్పుడు కూడా ఏడాదికి రూ. 600 కోట్లు ఖర్చు చేసి పేటీఎం బ్యాచ్ ని పెట్టి మరీ సోషల్ మీడియా ద్వారా ప్రజల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను కాపు సోదరులు గుర్తించాలని కోరారు.
టాపిక్