CBI Cases : ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు.. ఏపీనే టాప్
CBI Cases In Andhra Pradesh : ఐదు సంవత్సరాలో చూసుకుంటే.. ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసుల్లో ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమే చెప్పింది.
ఐదేళ్ల కాలంలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసుల్లో(CBI Cases) ఏపీనే టాప్ ప్లేసులో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. లోక్ సభ(Lok Sabha)లో ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు డీవోపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017 నుంచి 2021 వరకు చూస్తే.. ఏపీలో 10 సిబీఐ కేసులు నమోదయ్యాయని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ(Kerala)లో ఆరు కేసులు ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో 5 సీబీఐ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు(Tamil Nadu)లో 4 కేసులు ఉన్నాయి. 2017 నుంచి 2022 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 22 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు అయ్యాయి. సీబీఐ కేసుల్లో శిక్ష రేటు చూసుకుంటే.. 2017లో 66.90 శాతం, 2018-68, 2019-69.19, 2020-69.83, 2021లో 67.56 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జీతేంద్ర సింగ్ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అత్యధిక కేసులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నమోదయ్యాయని చెప్పారు. పది మంది రాజకీయ నేతలపై సీబీఐ కేసులు నమోదయ్యాయని సమాధానం ఇచ్చారు.
విశాఖలో నైపుణ్య శిక్షణ
మహిళలకు నైపుణ్య శిక్షణ(Skill Development) కోసం దేశంలోని ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు(NSTI) పనిచేస్తున్నాయని స్కిల్ డెవలప్ మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా.. 33 ఎన్ఎస్టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్టుగా చెప్పారు.
అయితే వీటిలో 19 ఎన్ఎస్టీఐలు మహిళల కోసం ప్రత్యేకంగా నెలకొల్పినట్టుగా తెలిపారు. విభజనకు ముందుగా ఏపీలో మూడు ఎన్ఎస్టీఐలు నెలకొల్పగా.. అందులో ఒకటి మహిళల కోసం అని చెప్పారు. విభజన తర్వా.. ఏపీలో నెలకొల్పలేదని... విశాఖ(Visakha) గాజువాకలోని క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ట్రైనర్స్ ను అనుబంధ సంస్థగా ప్రకటించి.. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. సుమారు 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.