Guntur Tractor Accident : గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురి మృతి, 20 మందికి గాయాలు!
Guntur Tractor Accident : గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు.
Guntur Tractor Accident : గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరులో ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మార్గమధ్యలో మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 7గురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
రాజస్థాన్ లో లోయలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
రాజస్థాన్ లో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి వస్తుండగా ఓ ట్రాక్టర్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆగుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. రాజస్థాన్ జుంజును జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గత సోమవారం(మే 29)న స్థానికంగా ఓ కొండపై ఉన్న మన్సా మతా ఆలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున పుజాలు నిర్వహించారు. దీంతో చుట్టుపక్క ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గుడికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉందని ప్రత్యక్ష స్థానికులు వెల్లడించారు. ట్రాక్టర్అదుపుతప్పి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తీవ్ర ఆవేదన కలిగించింది- పవన్
ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ ప్రార్థించారు. శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరమని పవన్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.