New Medical Colleges: ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధం..
New Medical Colleges: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావడంతో నీట్ ద్వారా అడ్మిషన్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
New Medical Colleges: ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
నాలుగేళ్లలోనే 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి పూనుకోవడం చారిత్రాత్మకమని చెబుతున్నారు. ఈ ఏడాది ఐదు మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. రూ.8500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నారు.
మెడికల్ కాలేజీలను ప్రారంభించే జిల్లాల కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలేజీల నిర్మాణపు పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. మెడికల్ కాలేజీల్లో హాస్టళ్ల ఏర్పాటు, శానిటేషన్, హౌస్ కీపింగ్ , రోడ్ల నిర్మాణం, కాలేజీ బస్సులు తదితర అంశాలపై సమీక్షించారు.
మెడికల్ కాలేజీల నిరమాణ పురోగతిపై వారానికోసారి పనుల్ని సమీక్షించుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు మంత్రి రజని ఆదేశించార. ఈ ఏడాది ఆగస్టు లో రాష్ట్రంలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. వచ్చే సెప్టెంబర్లో ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభవుతాయన్నారు.
విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్టణం, రాజమండ్రి మెడికల్ కళాశాలకు ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు మెడికల్ కాలేజీలకు ఎన్ ఎంసి అనుమతులు లభించినందున నిర్మాణ పనులు, హాస్టల్ ల ఏర్పాటు, శానిటేషన్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ , రిక్రూట్ మెంట్ తదితర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని , సీరియస్ గా తీసుకుని విజయవంతం చెయ్యాలన్నారు.
ఐదు కాలేజీలకూ సరిపడా బస్సుల్ని కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఏ కాలేజీలోనూ ఎటువంటి లోపాలూ ఉండకుండా చూసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దన్నారు. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాల ఏర్పాటు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున, ఆ దిశగా పనులు కనిపించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు న్నా వెనువెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ లకు సూచించారు. విద్యుత్ , నీటి సరఫరా, జనరేటర్ల ఏర్పాటు అన్నీ పక్కాగా వుండాలన్నారు.
నాణ్యమైన వైద్య విద్య మన రాష్ట్ర విద్యార్థులకు అందించాలన్ననే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చినప్పట్నించీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారన్నారు. మొత్తం 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.8500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నిర్మాణ పు పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ ఈఏడాది 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయనీ చెప్పారు.
కొత్త కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అదనంగా మనకు రాబోతున్నాయన్నారు. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్యనభ్యసించే అవకాశం ఈ కాలేజీల ద్వారా లభిస్తుందని మంత్రి రజని తెలిపారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడుంబిగించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేవలం నాలుగేళ్లలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలను సాధించుకుని, తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా వున్నామన్నారు. రానున్న రెండు , మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఈ మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిబ్బందిని పెంచడం, వసతులు గణనీయంగా పెంచడం, మెడికల్ కళాశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, పరికరాలు పెంచడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకోవడం ద్వారా పీజీ సీట్లను పెంచుకోగలుగుతున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3257కు పెంచిందన్నారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మండలానికి రెండు పీహె చ్సీలు ఉండాలని నిర్ణయించామన్నారు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ కనివినీ ఎరుగని విధంగా 49 వేలకు పైగా నియామకాలు చేపట్టిన ఘనత జగనన్నకే దక్కుతుందని మంత్రి రజని చెప్పారు.