AP Zonal Issue: ఏపీలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు…
AP Zonal Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో అదనంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపధ్యంలో జోనల్ వ్యవస్థ, స్థానికత అంశాల్లో చేపట్టాల్సిన మార్పులు చేయనున్నారు. లోకల్, నాన్ లోకల్ నిర్వచనాలపై 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు
AP Zonal Issue: ఆంధ్రప్రదేశలో కొత్తగా జోనల్ అంశం తెరపైకి వచ్చింది. ఏపీలో గత ఏడాది జిల్లాల పునర్విభజన చేయడంతో జోనల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. కొత్త జోన్లు, స్ధానికత అంశంపై సమావేశం నిర్వహించినట్లు మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. జోనల్ విధానంపై ముసాయిదా తయారు చేశామని, త్వరలోనే ఉద్యోగులతో చర్చించి ప్రతిపాదనలను క్యాబినెట్లో పెడతామన్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపధ్యంలో జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాల్లో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశాలపై మంత్రుల బృందం (జిఓయం) ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించింది.
రాష్ట్ర విభజన నేపధ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన దృష్ట్యా పాత జోనల్ విధానంలో మార్పులు,స్థానికత తదితర అంశాలపై మంత్రుల బృందం ప్రాధమికంగా చర్చించింది. ఈ ఆంశంపై మరిన్ని సమావేశాలు నిర్వహించి విస్తృత స్థాయిలో వివిధ ఉద్యోగ సంఘాలు,ఇతర వర్గాలతో చర్చించి వారి సూచనలు,సలహాలను తీసుకుని దీనిపై ఒక ముసాయిదాను రూపొందించి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉంది.
పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్రానికి సిఫార్సులను పంపి తద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులు పొందాల్సి ఉంది. ఈఅంశపై తొలి సమావేశం కావడంతో మంత్రుల బృందం ప్రాధమికంగా వివిధ అంశాలపై చర్చించారు. సమీప రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థ, స్థానికత అంశాలు ఏవిధంగా అమలవుతున్నారనే విషయంలో అధికారులను మంత్రుల బృందం వివరాలు అడిగి తెలుసుకుంది.
రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాలపైన వివరించారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నియామకాల్లో చేపట్టాల్సిన మార్పులపై ప్రాథమిక చర్చలు నిర్వహించారు.