Congress : సౌత్ లోని కర్ణాటకను కొట్టేశారు...! నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే...!
Telangana Assembly Elections 2023: కర్ణాటకలో విక్టరీ కొట్టేసింది కాంగ్రెస్. ఈ ప్రభావం… గాంధీ భవన్ కు గట్టిగానే తాకనుంది. ఫలితంగా ఇక్కడి నేతలు మరింత యాక్టివ్ కానున్నారు. ఇక అగ్రనేతలు కూడా పర్యటనలు జోరందుకోనున్నాయి.
Congress Focus On Telangana: దక్షిణాదిలోని కీలకమైన కర్ణాటకలో ప్రభంజనం సృష్టించింది కాంగ్రెస్. ఎన్నికల నాటికే ప్రజల్లోకి వెళ్లిన అక్కడి నాయకత్వం.... బీజేపీని అన్ని విధాలా ఢీకొట్టేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచే దిశగా వెళ్తోంది. ఫలితంగా దక్షిణాదిలో మళ్లీ హస్తం జెండాలు రెపరెపలాడనున్నాయి. ఇవాళ్టితో కర్ణాటక రిజల్ట్స్ తేలిపోవటంతో... ఇక అందరిచూపు తెలంగాణపై పడనుంది. మరికొద్ది నెలల్లోనే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్... కంప్లీట్ గా తెలంగాణ టార్గెట్ గా పని చేయబోతుంది. ఇప్పటికే కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పుతో జోష్ లోకి వచ్చేసిన కాంగ్రెస్.... తెలంగాణలోనూ పక్కా ప్రణాళికలను అమలు చేయటానికి సిద్ధంకాబోతుంది.
ట్రెండింగ్ వార్తలు
కీలకమైన కర్ణాటకలో గెలవటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ మరింత ఆత్మవిశ్వాసం పెరగటం ఖాయంగానే కనిపిస్తోంది. నిజానికి కర్ణాటక కాంగ్రెస్ లోనూ విభేదాలు ఉన్నప్పటికీ... ఎన్నికల నాటికి అన్నింటిని పక్కనపెట్టేశారు. ప్రత్యర్థిని పడగొట్టడమే లక్ష్యంగా పని చేశారు. అలాంటి ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేసేందుకు హస్తం అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే మిషన్ ను షురూ చేసింది. పాదయాత్రలు, దీక్షలు, నిరసన ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.... కొద్దిరోజుల కిందటే అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీని హైదరాబాద్ కు రప్పించారు. యూత్ ను ఆకర్షించేలా డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. మరికొద్దిరోజుల్లోనే రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.... పక్కాగా ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు సమైక్యరాగం వినిపిస్తున్నారు. ఎలాగైనా బీఆర్ఎస్ సర్కార్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. విబేధాలను పక్కనపెట్టి కలిసిగట్టుగా పని చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక ప్రజలు ఇచ్చిన బూస్ట్ తో ఇక్కడ కూడా ఆ దిశగానే పని చేసే అవకాశం ఉంది. హైకమాండ్ కూడా... ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకుండా... వర్కౌట్ చేయాలని చూస్తోంది. తాజా విజయం ఫలితంగా దక్షిణాదిలో కాంగ్రెస్ పునర్ వైభవానికి మళ్లీ దారులు తెరుచుకునే అవకాశం లేకపోలేదు. అయితే కర్నాటక మాదిరిగానే తెలంగాణలోనూ నేతలు కలిసిగట్టుగా పని చేస్తే... ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడొచ్చు....!
సంబంధిత కథనం