Fake Notes Seized: ఏం టాలెంట్ రా బాబు.. యూట్యూబ్లో చూసి రూ. 2 వేల నోట్ల తయారీ!
seized fake notes in warangal: ఫేక్ కరెన్సీ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు వరంగల్ నగర పోలీసులు. మొత్తం రూ. 6 లక్షల నోట్లను సీజ్ చేశారు. ఈ కేసులో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు.
warangal city police seized fake notes: Fake currency notes printing: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 300ల రూ.రెండు వేల నోట్లు (6 లక్షలు), ప్రింటర్, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను వరంగల్ సీపీ తరుణ్ జోషి శుక్రవారం వివరించారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించారని సీపీ వెల్లడించారు. ఈ టైంలోనే వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందని.. వారి ద్వారా దొంగ నోట్లు ముద్రించే తీరును తెలుసుకున్న నిందితులు.. జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారని సీపీ వివరించారు. వీరు ముద్రించే ఈ నోట్ల గురించి ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఈ ముఠా యూట్యూబ్ను అనుసరించారు.
"ఒరిజినల్గా రూ.2 వేలు ముద్రించే కాగితాన్ని పోలి ఉండే కాగితాన్ని కొనుగోలు చేసి వీటిని ముద్రించారు. నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీ ఉండే వ్యాపార సముదాయాలతో పాటు కిరాణ, బట్టల షాపులు, మద్యం బెల్ట్ షాపుల వద్దకు వెళ్లి చలామణి చేశారు. గత సంవత్సర కాలంగా ఈ దందా నడిపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు ఆ ముఠాకే చెందిన మరో వ్యక్తితో కలిసి దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. దీంతో వీరి దొంగ నోట్ల వ్యవహరం బయటపడింది" అని సీపీ తరుణ్ జోషీ వెల్లడించారు.
ఫేక్ నోట్ల తయారీ చేస్తున్న వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసు అధికారులను సీపీ తరుణ్ జోషీ అభినందించారు.