'నవభారత నిర్మాణానికి రామానుజాచార్యులు ఆదర్శం’
Samata Murthy statue | వివక్షకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు.. సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రామానుజాచార్యుల ఆదర్శాలను యువత అర్థం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
Venkaiah Naidu visit to Hyderabad today | హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితమే అంటరానితనం, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి, సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగానూ సమాజంపై చెరగని ముద్ర వేశారన్నారు.
భగవంతుడు అందరివాడు అంటూ శ్రీ రామానుజుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం ప్రపంచానికి నూతన మార్గంలో దిశానిర్దేశం చేసిందన్న ఉపరాష్ట్రపతి.. అలాంటి మహనీయుని అతిపెద్ద విగ్రహాన్ని ముచ్చింతల్లో నెలకొల్పడం వారి గొప్పతనాన్ని.. ప్రపంచానికి చాటడమే గాక, వారి స్ఫూర్తిని ముందుతరాలకు అందజేయగలదన్నారు. సమతా ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన శ్రీ చిన్నజీయర్ స్వామికి, భూమిని విరాళంగా ఇచ్చిన మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు, రామానుజ సహస్రాబ్ధి కమిటీ సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
రామానుజాచార్యులు గురువు కోసం సాగించిన అన్వేషణ ఈతరం యువతకు స్ఫూర్తిదాయకమన్న ఉపరాష్ట్రపతి.. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో గురువు ప్రాధాన్యతను గుర్తించే దిశగా వారి జీవితం నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. స్త్రీ విద్య విషయంలో వెయ్యేళ్ల క్రితమే రామానుజుల ఆచరణాత్మక ఆలోచన విధానాన్ని తెలియజేశారన్న ఉపరాష్ట్రపతి.. "బేటీ బచావ్ బేటీ పఢావ్" పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆచరణలో చూపించడం అభినందనీయమన్నారు.
సమతా విగ్రహాన్ని సందర్శన స్థలంగానే గాకుండా, రామానుజాచార్యుల చరిత్రను, సందేశాలను తెలియజేసే విధంగా గ్యాలరీను ఏర్పాటు చేయడం, వేదిక్ డిజిటల్ లైబ్రరీలకు రూపకల్పన చేయడం మంచి ఆలోచన అని ఉపరాష్ట్రపతి అన్నారు. వీటి ద్వారా ఆధ్యాత్మిక స్ఫూర్తి పరిఢవిల్లడమే గాక, మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆకాంక్షించారు.
ప్రముఖుల రాకతో మెరిసిన ముచ్చింతల్
Chiranjeevi | హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కేంద్ర వినియోగదారులు వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి, ప్రధాన ట్రస్టీ శ్రీ జె.రామేశ్వరరావు, సినీ నటులు శ్రీ చిరంజీవి, శ్రీ రామానుజ సహస్రాబ్ది కమిటీ అధ్యక్షులు శ్రీ జి.వి. భాస్కర్ రావు, జియ్యర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ సి.లక్ష్మణరావు, దివ్యసాకేతం అధ్యక్షులు శ్రీ కె.వి.చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామానుజాచార్యులపై వారు ప్రసంగించారు.
సంబంధిత కథనం