JNTU Dual Degree : జేఎన్టియూ డ్యూయెల్ డిగ్రీపై ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల ఆసక్తి
JNTU Dual Degree : జేఎన్టియూ ప్రవేశపెట్టిన డ్యూయెల్ డిగ్రీపై ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తమ పరిధిలోనూ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఛత్తీస్ గఢ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇప్పటికే జేఎన్టియూతో ఎంఓయూ కుదుర్చుకుంది.
JNTU Dual Degree : హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technological University–Hyderabad) ప్రారంభించిన డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రామ్ కి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులే కాకుండా... దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలు.. జేఎన్టియూ విధానంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. బీటెక్, బీఫార్మసీ, బీబీఏ డాటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ లతో కూడిన కోర్సులపై తమ విశ్వవిద్యాలయాల్లోనూ అందించేందుకు సిద్దం అవుతున్నాయి. ఇందుకు జేఎన్టియూ హైదరాబాద్ సహకారం కోరుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ టెక్నికల్ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ లద్ధాఖ్.. అరుణాచల్ విశ్వవిద్యాలయం డ్యూయెల్ డిగ్రీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ జేఎన్టియూ సహకారంతో.. ఆయా యూనివర్సిటీల్లో కోర్సులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ అంశంలో ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. దీని ప్రకారం... ఛత్తీస్ గఢ్, లద్దాఖ్, అరుణాచల్ యూనివర్సిటీలు .. జేఎన్టియూ సహాయంతో కోర్సులు నిర్వహిస్తాయి. ఎంచుకున్న స్ట్రీమ్ లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు... డ్యూయెల్ డిగ్రీని ఆయా యూనివర్సిటీలే అందిస్తాయి. బీబీఏ డాటా ఎనలిటిక్స్ డిగ్రీని మాత్రం హైదరాబాద్ జేఎన్టియూ అవార్డు చేస్తుంది. ఇందుకు కోసం ఛత్తీస్ గఢ్ యూనివర్సిటీ ఇప్పటికే జేఎన్టియూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో లద్దాఖ్, అరుణాచల్ యూనివర్సిటీలు ఎంఓయూ కుదుర్చుకోనున్నాయి.
2022-23 విద్యాసంవత్సరం నుంచి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ డాటా ఎనలిటిక్స్ కోర్సుల్లో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ప్రారంభించింది..... హైదరాబాద్ జేఎన్టియూ. డ్యూయల్ డిగ్రీ పాలసీప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. కనీసం 20 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న కళాశాలలకు మాత్రమే డ్యూయల్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు అనుమతి లభిస్తుంది. సిలబస్ లో 50 శాతం ఆన్ లైన్ ద్వారా బోధిస్తారు. మిగతా 50 శాతానికి ప్రత్యక్ష విధానంలో క్లాసులు నిర్వహిస్తారు. జేఎన్టియూ పరిధిలో 2, 3, 4 ఇయర్ చదవుతున్న విద్యార్థులే.. డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఏడాదికి రూ.60 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడేళ్లకు గాను రూ.1.80 లక్షల ఫీజు చెల్లించాలి. దీంతో పాటు ప్రత్యేక ఫీజు కింద ఏటా రూ.5,500, పరీక్ష ఫీజు రూ.1,910(సెమిస్టర్కు రూ.955 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన వారు కనీసం మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఆరేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈలోగా కోర్సు పూర్తి చేయకపోతే అడ్మిషన్ రద్దవుతుంది. డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు... ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయి.
టాపిక్