TSPSC Paper Leak: ఇంటిదొంగలు. . టిఎస్పిఎస్సీ ఉద్యోగులకు ప్రిలిమ్స్లో ర్యాంకులు
TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ వ్యవహారంలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అరెస్టైన వారే కాకుండా పేపర్ లీక్ వ్యవహారంలో మరికొందరు ఉద్యోగులకు సంబందం ఉన్నట్లు గుర్తించారు.ప్రిలిమ్స్ పరీక్షల్లో 10మంది ఉద్యోగులకు 100కు పైగా మార్కులు సాధించినట్లు వెల్లడైంది.
TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు సిట్ నోటీసులిచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల్లో దాదాపు పదిమందికి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తోంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల్లో వారంతా మెరుగైన మార్కులు సాధించినట్లు వెల్లడైంది. కొందరికి వందకు పైగా మార్కులు వచ్చాయని గుర్తించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. సిట్ పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి కాల్డేటా, వాట్సప్ గ్రూపులు, చాటింగ్ ఆధారంగా నిఘా బృందాలు పేపర్లు అందుకున్న వారి గురించి వాకబు చేస్తున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కమిషన్లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పరీక్షలు రాశారు. వీరిలో కొందరికి 100కు పైగా మార్కులు వచ్చాయి. ఉద్యోగాలు చేస్తూ పరీక్షలు 100మార్కులు సాధించడంపై దృష్టి సారించారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమయ్యారు.
ఏఈ పరీక్ష రాసిన గోపాల్, నీలేష్కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించారు. మేడ్చల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదును ప్రవీణ్కు ఇప్పించినట్టు తెలుస్తోంది.
బడంగ్ పేటలోని ప్రవీణ్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర్రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్న పత్రాలను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. మార్చి 5న నీలేష్, గోపాల్ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాశారు. పేపర్ ఇచ్చినందుకు ఇద్దరు అభ్యర్థులు కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా రూ.14లక్షలు సమకూర్చినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిందితురాలు రేణుకతో పాటు ఆరుగురిని హిమాయత్ నగర్లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్లు సీసీఎస్ కార్యాలయంలోనే ఉన్నారు.
ఇంటి దొంగల పాత్ర స్పష్టం….
పేపర్ లీకేజీ వెనక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ఫోన్లో మాట్లాడిన వారి చిరునామాలు సేకరించిన సిట్.. అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి విచారిస్తోంది. నిందితుల వెనక ఎవరున్నారనే వివరాలు ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరిస్తున్నారు. హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో టీఎస్పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మిని సిట్ పోలీసులు విచారించారు. ప్రశ్నపత్రాలను కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిలు కమిషన్లోని ఆమె కంప్యూటర్ను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ను శంకరలక్ష్మి డైరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. డైరీలో తాను ఎలాంటి యూజర్ఐడీ, ఐడీ రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. రెండోసారి ఆమెను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సుమారు గంటపాటు ప్రశ్నించి ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టారు.