Forest Dept Notices ఖాళీ చేయాలంటూ గొత్తి కోయలకు అటవీ అధికారుల నోటీసులు....
Forest Dept Noticesతెలంగాణలో అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అడవుల్ని నరికి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల్ని అడ్డుకోవడంతో గత వారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను గిరిజనులు నరికి చంపారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడంతోనే హత్య జరిగిందని అటవీ శాఖ చెబుతోంది. హరితహరంలో భాగంగా నాటిన మొక్కల్ని గొత్తికోయలు ధ్వంసం చేస్తుండటాన్ని అడ్డుకోవడంతో వివాదం తలెత్తిందని అటవీ శాఖ చెబుతోంది.
Forest Dept Notices భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గొత్తికోయలు, అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గొత్తికోయలు నవంబర్ 22న చేసిన దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు మృతి చెందడంతో అటవీ శాఖ ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. మరోవైపు హత్య నేపథ్యంలో బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తికోయలను తమ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఆదివారం ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అప్పయ్య నేతృత్వంలో వివిధ రేంజ్ల అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు నడుమ గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకున్న తర్వాత వాటిని తొలగించారని గొత్తికోయలు చెబుతున్నారు.
అటవీ ప్రాంతాల నుంచి గొత్తికోయల్ని ఖాళీ చేయాలని, నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనని అటవీ అధికారులు ధృవీకరించారు. ఎఫ్ఆర్వో హత్య తర్వాత అడవిలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది భయపడుతున్నారని చెప్పారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు అడవుల్లో ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు. 2016 తర్వాత గొత్తి కోయలు ఈ ప్రాంతాలకు వలస వచ్చారని అటవీ చట్టాల ప్రకారం వారికి చంద్రుగొండ ప్రాంతంలో నివసించే హక్కు లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి వలస వచ్చారో అదే ప్రాంతానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదివాసులకు అటవీ శాఖ నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వం దయ చూపాలంటున్న గిరిజనులు....
అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తమ గూడెంలోని ఇద్దరు వ్యక్తులు చేసిన పనికి అందరికీ శిక్ష విధించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో శాంతిభద్రతల పరిస్ధితి అధ్వానంగా ఉండటం, సాల్వజుడుం నుంచి ప్రాణ భయంతో జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చామని చెబుతున్నారు.
తమకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే ఉన్నాయని, ఉపాధి హామీ కార్డులు ఇచ్చారని పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. గూడెంకు చెందినపొడియం తుల, మడకం నంగా రేంజర్ శ్రీనివాసరావుపై దాడి చేసి హత మార్చడాన్ని తాము కూడా తప్పు పడుతున్నామని, అందర్నీ వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమపై దయ చూపించాలని వేడుకుంటున్నారు.