Tiger In Peddapalli : పెద్దపల్లి జిల్లాలో పులి గుర్తులు.. ఇంతకీ ఎన్ని తిరుగుతున్నాయి?
Tiger Movements In Peddapalli : పెద్దపల్లి ప్రాంతంలో పులుల సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ మధ్య మంథని ఏరియాలో పులి పరిగెడుతున్నట్టుగా ఓ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి పెద్దపల్లి జిల్లా పరిసర ప్రాంతాల్లో పులులు సంచారిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
గోదావరి(Godavari), మానేరు నదుల పరివాహక ప్రాంతాల్లోని మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల అడవుల్లో ఇటీవలి నెలల్లో పులుల సంచారం నమోదవడంతో గ్రామాల్లో భయం నెలకొంది. మొదట మంచిర్యాల(Mancherial) జిల్లాలోని టైగర్ జోన్లో పులిని గుర్తించారు. తరువాత పెద్దంపేట, ధర్మారం, కొత్తూరులో పులులు సంచరించినట్టుగా కనిపించాయి. పెద్దపల్లి(Peddapalli) మండలం దస్తగిరిపల్లి గ్రామంలో బుధవారం పులి కనిపించింది.
ట్రెండింగ్ వార్తలు
45 రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా(Mulugu District) సరిహద్దుల్లోని గ్రామాల వాసులు పలిమెల మండలం తమ్మేటిగూడెం సమీపంలోని పొలాల్లో సగం తినేసిన ఆవు కళేబరాన్ని గుర్తించారు. నాచారం మండలం జమ్మల బండలో గత వారం రోజులుగా పులుల సంచారం కనిపించింది. రెండు వారాల క్రితం మల్హర్ మండలం మల్లారం గ్రామ శివారులోని పెద్ద గుట్టల సమీపంలో రోడ్డు దాటుతున్న పులిని గుర్తించారు.
పెద్దపల్లి జిల్లా మంథని(Manthani) మండలం మానేర్ నదిని దాటి యడ్లపల్లి అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లడాన్ని గ్రామస్థులు గమనించారు. తమ పొలాల్లో పులుల పాదముద్రలను గమనించి అటవీశాఖాధికారులను రైతులు అప్రమత్తం చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, ఆ శాఖకు చెందిన యానిమల్ ట్రాకర్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, పాదముద్రలు ఒకే పులివేనని నిర్ధారించారు.
పులి ప్రయాణం హుస్సేన్మియా వాగు వైపు ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రజలు పశువులు, మేకలు, గొర్రెలను మేపడానికి వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి దూరంగా వెళ్ళే వరకు కొన్ని రోజులు వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.