Land Regularization: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో మార్పులు.. ఏమేం కావాలో తెలుసా?
భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. జీవో నెంబర్ 59 ద్వారా భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు తెచ్చింది.
భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనిప్రకారం.. మొదటి వాయిదాగా చెల్లించాల్సిన 12.5 శాతాన్ని దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ రుసుం కింద దరఖాస్తు సమయంలో రూ.1000 చెల్లించాలని.. రెవెన్యూ శాఖ పేర్కొంది. 58, 59 జీఓలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ కోసం.. మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు సంబంధిత ధ్రువపత్రం, స్థలం ఫొటోను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.
జీవో 58, 59లకు అనుగుణంగా భూములను క్రమబద్ధీకరించుకోవచ్చని.. ప్రభుత్వం ఈ నెల 14న కొత్త జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం... గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా.. వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 2014 జూన్ 2వ తేదీనాటికి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో ఉన్న వారికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది.
ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.. దీని ప్రకారం.. 125 గజాలలోపు స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుంటే వాటిని ఉచితంగా రెగ్యూలరైజ్ చేస్తారు. 250 చదరపు గజాల్లోపు ప్రభుత్వ విలువలో 50 శాతం, 250–300 గజాల్లోపు 75 శాతం, 500–1000 గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్న వారు 100 శాతం ప్రభుత్వ విలువను చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తారు. ఒకవేళ.. గృహేతర భూములు మాత్రం ఆక్రమణలో ఉంటే.. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వ వాల్యూ చెల్లించాలి.
దరఖాస్తుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. స్థలం అధీనంలో ఉన్నట్లు ఆస్తి పన్ను చెల్లించిన రశీదు, విద్యుత్ బిల్లు, తాగునీటి బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి జత చేయాలి.