Gadwal Bidda: సోషల్ మీడియా సెన్సేషన్ గద్వాల్ బిడ్డ మృతి.. నెటిజన్ల దిగ్భ్రాంతి
‘నువ్ ఎవనివో నాకు తెల్వదు.. మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా..’ అంటూ అనుకోకుండా చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయాడు గద్వాల్ బిడ్డ. ఇప్పటికీ మీమ్స్ పేజీలకు వాళ్లకు అతడో మంచి స్టఫ్. కానీ చిన్నవయసులోనే అనారోగ్యంతో మృతి చెంది.. అందరినీ విషాదంలోకి నెట్టేశాడు.
నువ్ ఎవనివో నాకు తెల్వదు అంటూ.. కోట్లాది మందికి పరిచయమైన బాలుడు గద్వాల్ బిడ్డ ఇక లేడు అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అతడు మృతి చెందినట్టు తెలిసి.. నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతడి అసలు పేరు మల్లికార్జున్ రెడ్డి. అతని స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్న. ఒక్క వీడియోతో ఈ బాలుడు సంచలంగా మారాడు.
డైరెక్టర్ ఆర్జీవీ మీద కామెంట్లు చేస్తూ.. గద్వాల్ బిడ్డ విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి గద్వాల్ బిడ్డ మీమ్స్ పేజీల వాళ్లకు స్టఫ్ గా మారాడు. ఆర్జీవీ ప్రకటించిన ఓ టైటిల్ పై దుమారం రేగింది. దీనిపైనే మల్లికార్జున్ వీడియో చేశాడు. ఆ వీడియోలో గద్వాల్ బిడ్డగా తనను తానూ పరిచయం చేసుకుంటూ.. ఆర్జీవీని దూషిస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే అదే సమయంలో కొన్ని దళిత సంఘాలు.. ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను కించపరిచేలా వ్యవహరించాడంటూ.. మండిపడ్డాయి.
గద్వాల్ బిడ్డ మైనర్ కావడంతో.. పోలీసుల సమక్షంలోనే అతడితో క్షమాపణలు చెప్పించారు. అయితే అతడు సారీ చెప్పిన.. ఏడుపు వీడియో కూడా వైరల్ గా మారింది. అప్పటి నుంచి ఈ చిన్నారి.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ.. మీమర్స్ కు మాత్రం గద్వాల్ బిడ్డ ఎప్పటికీ స్టఫే. ట్రోల్ వీడియోస్, స్టిక్కర్స్ తో అతడిని ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత అతడికి చెందిన ఒకటి రెండు వీడియోలు బయటకు వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఆకస్మాత్తుగా మృతి చెందాడని తెలిసి.. నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తమాతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో ఆ బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓ సినిమాలోనూ గద్వాల్ బిడ్డ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మృతి చెందాడని.., అతని కుటుంబ సభ్యులే స్వయంగా వెల్లడించినట్లు సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. జోగులాంబా గద్వాల్ జిల్లాలోని జిల్లేడుదిన్నెలో గద్వాల్ బిడ్డ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.