Bodhan | బోధన్లో టెన్షన్.. టెన్షన్.. 144 సెక్షన్ విధింపు.. కారణం ఏంటంటే?
నిజామాబాద్ జిల్లా బోధన్ లో హై టెన్షన్ నెలకొంది. శివాజీ విగ్రహం.. ఏర్పాటు విషయంలో వివాదం రేగింది. పరిస్థితి చేయిజారి పోతుండటంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో రాత్రికి రాత్రే.. శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు శివసేన, బీజేపీ కార్యకర్తలు. దీంతో వివాదం చెలరేగింది. మైనారిటీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రే.. విగ్రహం.. ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ కారణంగా బోధన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బోధన్ పట్టణంలో రాత్రి.. ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శివసేన, బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా.. చర్చించుకుంటున్నారు. తెల్లారి లేచి చూసేసరికి.. శివాజీ విగ్రహం ఏర్పాటుపై మరో వర్గం మండిపడింది. అలా ఎలా చేస్తారని ప్రశ్నించింది. విగ్రహాన్ని.. తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నడుస్తుండగా.. అక్కడకు ఇరువర్గాల నేతలు, ప్రజలు భారీగా వచ్చారు. గొడవ కాస్త పెద్దదైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ ఫోర్స్ బలగాలు బోధన్ చేరుకున్నాయి. రెండు వర్గాలపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల నేతలకు పోలీసులు నచ్చజెప్పే.. ప్రయత్నం చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎంత నచ్చజెప్పే.. ప్రయత్నం చేసినా.. వినిపించుకోలేదు. ఇందులో భాగంగానే.. పోలీసుల పైకి కొంతమంది రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం.. పరిస్థితి అదుపులోనే ఉందని.. సీపీ తెలిపారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని.., మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే ఊరుకోమన్నారు.